సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ చుట్టూ పెరుగుతున్న పట్టణీకరణపై హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో నేపథ్యంలో రెండు నెలలుగా భవన నిర్మాణాల అనుమతులు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.
అదేవిధంగా ఎల్ఆర్ఎస్, సీఎల్యూ వంటి పనుల కోసం ప్రజలు అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
భవన నిర్మాణాల అనుమతులు, మాస్టర్ప్లాన్కు అనుగుణంగా కల్పించాల్సిన మౌలిక వసతులు, భూ వినియోగ మార్పిడి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్ లండన్ పర్యటనలో ఉండడంతో సమావేశానికి సంబంధించిన నివేదికను ప్రత్యేకంగా ఆయనకు అందజేయనున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్ పూర్తి స్థాయిలో సమీక్షించి, పట్టణ ప్రణాళిక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.