రవీంద్రభారతి,డిసెంబర్ 5 : రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాదిగ కులానికి చెందిన నేతకే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు దొరల తెలంగాణ అని నీతులు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెడ్లను ముఖ్యమంత్రి చేయడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లే అవుతుందన్నారు. తక్షణమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాష్ట్రంలో మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కర భూమన్న మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారం కోసం.. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదని గగ్గోలు పెట్టి, తీరా అధికారం వచ్చాక సామాజిక న్యాయం పాటించకుండా రెడ్లను ముఖ్యమంత్రి చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి రెడ్ల తెలంగాణగా మారుస్తుందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మలు, రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా రెడ్లనే ముఖ్యమంత్రులను చేశారని… కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఎక్కడ పాటిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు తక్షణమే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రైతులకు తక్షణమే రైతుబంధు అమలు చేయాలని, రేవంత్రెడ్డి చేవెళ్ల సభలో ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయాలని తెలిపారు. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన 12 లక్షల దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు.
మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అధికార దాహంతో ప్రజలకు లేనిపోని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లేకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటిక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జున్ను రాజు మాదిగ, జాతీయ అధ్యక్షుడు వేముల బల్రామ్ మాదిగ, గోపి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.