సిటీ బ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఏండ్ల తరబడిగా పీజీలు, పీహెచ్డీలు చేసి చదివి ఉద్యోగాలు, ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నా జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది.
పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రాకపోవడంతో తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించలేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పీజీలు చదివిన నిరుద్యోగులు చాయ్ దుకాణాలు పెట్టుకుంటున్నారు. పీహెచ్డీలు పూర్తిచేసి డాక్టరేట్ పొందిన వారు కూరగాయల దుకాణాలతో బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో సరూర్నగర్లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగులు తమ టీస్టాళ్లు, కూరగాయల దుకాణాలు, పూల దుకాణాలను స్టాళ్ల రూపంలో ప్రదర్శించారు.
యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన నమ్మకద్రోహానికి నిరసనగా స్టాళ్లను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన మోసానికి ఉన్నత చదువులు చదివి చాయ్, కూరగాయలు, పూలు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పీజీలు పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నం. ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ పేరిట ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తామంటే కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించినం. అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నా ఉద్యోగాల భర్తీ లేదు. జాబ్ క్యాలెండర్ అమలు చేసేది లేదు. డిక్లరేషన్ హామీల అమలు లేదు. వయస్సు పెరుగుతున్నా ఇంకా కోచింగ్ సెంటర్లలో మగ్గలేకపోతున్నాం. చేసేదేమీ లేక పూల దుకాణాలు పెట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాకపోవడంతో.. పూలముమ్ముకునే దుస్థితి వచ్చింది. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ దుస్థితి తీసుకొచ్చారు. నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తాం. భవిష్యత్తులో గెలవనీయం.
– సతీశ్ యాదవ్, వరంగల్. ఇజాస్, మిర్యాలగూడ
నా పేరు జగదీశ్. మాది నల్లగొండ జిల్లా మర్రిగూడ. బీటెక్ పూర్తిచేసిన. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఎంటెక్ చదువుదామంటే సర్టిఫికెట్లు లేవు. ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేద్దామనుకున్నా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించడానికి ఆర్థికస్థోమత లేదు. తప్పని పరిస్థితిలో చాయ్ దుకాణం పెట్టుకున్నా. అమ్మానాన్నల మీద ఆధారపడి బతకలేక ఏదో ఒక పనిచేసుకోవాలని ఇలా చేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రీయింబర్స్మెంట్ ఆపేసింది. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. యూత్ డిక్లరేషన్ అని నమ్మించి మాలాంటి వాళ్లను నిండా ముంచింది.
– జగదీశ్,మర్రిగూడ, నల్లగొండ