అబిడ్స్, డిసెంబర్ 17 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పద్నాల్గవ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. సీఆర్ఎంపీ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రహదారుల నిర్మాణ పనులు జరిగాయి. అదేవిధంగా నూతనంగా రోడ్ల నిర్మాణ పనులు పూర్తైన తర్వాత టేబుల్ డ్రైన్ సీసీ నిర్మాణం, రోడ్ లేన్ మార్కింగ్, జీబ్రా క్రాసింగ్ లేన్ మార్కింగ్ పనులను చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సూచనల మేరకు ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. గుంతలమయంగా మారిన రహదారులలో నూతన రహదారుల నిర్మాణం, గుంతల పూడ్చివేత, అవసరమైన ప్రాంతాల్లో ప్యాచ్వర్క్ పనులను చేపట్టారు.
నూతన రోడ్డు నిర్మాణ పనులు..
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో రవీంద్రభారతి జంక్షన్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు, సీఆర్ఎంపీ ద్వారా రహదారుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల ప్రారంభమైన ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారిలో టేబుల్ డ్రైన్ సీసీ పనులను చేపట్టనున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తయ్యాయి
గుంతలు ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట్ల కొత్త రోడ్లను వేస్తున్నాం. పలు ప్రాంతాల్లో నూతన వీడీసీసీ, సీసీ, బీటీ రహదారుల నిర్మాణ పనులు చేశాం. నాణ్యతాప్రమాణాలు పాటిస్తున్నాం. అధికారుల పర్యవేక్షణలో పనులు సకాలంలో పూర్తిచేసేందుకు అన్నిచర్యలు తీసుకున్నాం. రహదారులపై ఏర్పడిన గుంతల పూడ్చివేత, అవసరమైన ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టినాము.