హయత్నగర్, మే 7: డివిజన్ పరిధిలోని కాలనీల్లో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆదేశించారు. శనివారం హయత్నగర్ డివిజన్లోని సాయి సిద్ధార్థ కాలనీలో తాత్కాలికంగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారం చేరడంతో కాలువ పొంగిపొర్లి కాలనీవాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ అక్కడికి చేరుకుని సమస్యను పరిశీలించి సత్వరమే శానిటేషన్ సిబ్బందిని పిలిపించి సమస్యను పరిష్కరించామని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సంబంధిత మున్సిపల్ అధికారులు నాలా, డ్రైనేజీ వ్యవస్థను సత్వరమే నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.