మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 1 : సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో రూ.10.10 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.650 కోట్లు కేటాయించామని తెలిపారు.
వాటితోనే నేడు సీవరేజీ పైపులైన్ పనులు, సిమెంట్ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, వైకుంఠదామాలు, చెరువుల సుందరీకరణ, లింక్ రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా రూ.500 కోట్లతో విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని అదేవిధంగా రూ.250 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని లింకురోడ్ల విస్తరణ పనులను త్వరలోనే మొదలుపెడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్యాదవ్, డీఈ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, హెచ్ఎండీఏ ఏఈ వెంకన్న, కౌన్సిలర్లు సుమిత్ర, శ్రీనివాస్, హరిబాబు, అనంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.