గ్రేటర్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ బీటలు వారుతున్నది. అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం కొంప ముంచుతున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్లోకి ప్యారాచూట్ నేత మైనంపల్లి హన్మంతరావు కాలుమోపింది మొదలు.. పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏకంగా మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేయగా.. మరికొన్ని గంటల్లో మూకుమ్మడి రాజీనామాలకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ప్యారాచూట్ నేతల గండం పొంచి ఉండటంతో మున్ముందు గ్రేటర్ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారనున్నదని ఆ పార్టీ నేతలే ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఐదు ఎకరాలు.. రూ.10 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మొదలైన ‘సీటుకు నోటు’ పరిణామాలన్నీ బలాన్ని చేకూరుస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల టికెట్లు ఖరారు ప్రక్రియలోనే కాంగ్రెస్కు దిమ్మతిరిగే పరిణామాలు ఎదురవుతున్నాయి. పార్టీని నమ్ముకొన్న వారిని పక్కకు పెట్టి.. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న వారికి ఎర్ర తివాచీ పరిచి.. టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం హస్తం పార్టీ నేతలను కలవరపరుస్తున్నది. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావుకు కండువా కప్పక ముందే నియోజకవర్గం కాంగ్రెస్ను అసంతృప్తి కుదిపేసింది. డీసీసీ అధ్యక్షుడు, బీసీ నేత నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. వాస్తవానికి కాంగ్రెస్ 45మంది బీసీలకు టికెట్లు ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్న కీలకమైన బీసీ నేతల్లో నందికంటి ఒకరు.
అంతేకాకుండా హైకమాండ్కు ఇచ్చిన బీసీ నేతల జాబితాలో నందికంటి పేరు రెండో స్థానంలోనే ఉంది. అయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్తో పాటు హైకమాండ్ బీసీ నేతను బలి చేసి.. మైనంపల్లికి టికెట్ హామీ ఇవ్వడం బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎంత మమకారం ఉందో తేటతేల్లమైంది. ఈ నేపథ్యంలో నందికంటి బాటలోనే మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, శ్రేణులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతుండటంతో ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ ఇక కోలుకునే పరిస్థితిలో లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మైనంపల్లి వెంట వచ్చిన గుప్పెడు మందితో పాటు కాంగ్రెస్లో మిగిలే మరో గుప్పెడు మంది తప్ప ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు.
అంతటా.. ‘సీటుకు నోటు’ వ్యవహారమేనా..?
మేడ్చల్లో కూడా చాలామంది నాయకులు టికెట్ ఆశిస్తుండగా.. ఇక్కడ కూడా మైనంపల్లి అనుచరుడు నక్క ప్రభాకర్ పేరు చక్కర్లు కొడుతుండటంతో పార్టీ శ్రేణులు తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమయ్యాయి.
అయితే ప్యారాచూట్ నేతలు రావడం వెనక ప్రధానంగా ‘సీటుకు నోటు’ వ్యవహారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం ఎపిసోడ్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు వివిధ రూపాల్లో చేతులు మారి, టికెట్ల ఖరారుకు దారి తీస్తున్నాయనే ప్రచారం జోరందుకున్నది. ఈ క్రమంలో గ్రేటర్లోనూ ప్యారచూట్ నేతల రాక వెనక ఇదే మర్మం ఉన్నదనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.