నకిలీ విత్తనాలపై అధికారులు నిఘా సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వానకాలం పంటల ప్రారంభానికి ముందు విత్తన కంపెనీలపై దృష్టి సారించకపోవడం మూలంగా నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతోంది. తక్కువ ధరకు విత్తనాల ఆశ చూపడంతో రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి ఇక్కట్లకు గురువుతున్నారు. పంట దిగుబడులు రాకపోగా పంటకు పెట్టిన పెట్టుబడి వెళ్లక అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. వానాకాలం పంట సాగు ప్రారంభం కావటంతో అవసరమైన విత్తనాలు రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రైతులకు తక్కువ రేటు ఆశచూపి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. అసలు కంపెనీ పేరులో ఒక అక్షరం మాత్రమే తేడాగా ముద్రిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కొందరు రైతులు నకిలీ విత్తనాలను గుర్తించి ఫిర్యాదు చేస్తే అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి.
మేడ్చల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో 400 విత్తన కంపెనీలతో పాటు పెద్ద సంఖ్యలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అందులో మెజార్టీ కంపెనీలు శామీర్పేట్, మేడ్చల్, దుండిగల్, కీసర, ఘట్కేసర్ మండలాల పరిధిలో ఉన్నాయి. ఇక్కడి ప్రాంతాల వారితో పాటు ఇతర రాష్ర్టాల డీల్లరకు ఇక్కడి నుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. జిల్లాలో ఉన్న విత్తన కంపెనీల నుంచి కాటన్(పత్తి), మిర్చి, వరి, వివిధ రకాల కూరగాయల పంటలకు సంబంధించి విత్తనాల సరఫరా జరుగుతుంది.
రైతులు ఫిర్యాదులు చేస్తేనే తనిఖీలు..
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆయా టాస్క్ ఫోర్స్ బృందాలు విత్తన కంపెనీలు, ప్రాస్సెసింగ్ యూనిట్లలో నిరంతరం తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కంపెనీల లైసెన్స్లు, రికార్డులు, రసీదులు, విత్తన ప్యాకెట్లు పరిశీలించి ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలి. ఒక వేళ తనిఖీలలో నకిలీ విత్తనాలు అని తేలితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆయా విత్తన కంపెనీలను సీజ్ చేస్తారు. అయితే నకిలీ విత్తనాలపై రైతులు ఫిర్యాదు చేస్తే తప్ప టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయడం లేదనే విమర్శలున్నాయి. కేవలం నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నాయనే ఆరోపణలున్నాయి.