ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా సమాచారమిస్తున్నారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం వివరాలు ఇలా ఉన్నాయి.
పీర్జాదిగూడ: మేడిపల్లి పోలీసులు గురువారం సాయంత్రం నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ. 13.50 లక్షలు పట్టుబడ్డాయి.
వెంగళరావునగర్: ఎస్ఆర్నగర్ పోలీసులు సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.9.90 లక్షలు పట్టుకున్నారు.
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ పోలీసులు బైపాస్ రోడ్డు అండర్పాస్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.7.2 లక్షలు పట్టుబడ్డాయి.
మియాపూర్ : మియాపూర్ పోలీసులు గోకుల్ చౌరస్తా సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీలో ద్విచక్ర వాహనదారుడి వద్ద 448.96 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి.
అబిడ్స్: అబిడ్స్ పోలీసులు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో మారుతి ఎస్ క్రాస్ వాహనంలో తరలిస్తున్న రూ. ఐదు లక్షల నగదును పట్టుకున్నారు.
మహేశ్వరం: మహేశ్వరం పోలీసులు గురువారం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 5.43 లక్షలు పట్టుబడ్డాయి.