ఘనంగా మహంకాళి అమ్మవారి ఘటోత్సవాల ఎదుర్కోలు
ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి తలసాని
బేగంపేట జూలై 3: ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢబోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలలో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘటత్సోవ అలంకరణను ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకరణకు సంబంధించిన పసుపు, కుంకుమ, అమ్మవారి ప్రతిమ, పట్టువస్ర్తాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలతో ఊరేగింపుగా కర్భలా మైదానానికి తీసుకువెళ్లారు. అంతకు ముందు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన జరిపించారు. ఆలయ మండపంలో గణపతి హోమం చేశారు.
రాత్రి 7 గంటలకు కర్భలా మైదానంలో ముస్తాబైన అమ్మవారి ఘటం పోతురాజుల విన్యాసాలు డప్పు చపుళ్ల మధ్య ఊరేగింపుగా తిరిగి మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నది. ఈ కార్యక్రమంలో ఈవో గుత్తా మనోహర్రెడ్డి, దేవాలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.