లష్కర్ ఉజ్జయిని మహాకాళికి రెండు రోజుల పాటు ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జానపద కళాకారులు, పోతరాజులు, శివ సత్తులు, వివిధ కళారూపాల నృత్యాలు, డప్పుల దరువుల నడుమ భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించారు. అనంతరం, భక్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అమ్మవారికి ఏకరువు పెట్టారు. ఆది, సోమవారాలు అమ్మవారికి బోనాలు, సాక, పలహారాలు సమర్పించారు. సికింద్రాబాద్ పుర వీధుల్లో భక్తుల జయ జయ ధ్వానాల నడుమ అంబారీపై అమ్మవారిని ఉంచి జనరంజకంగా ఊరేగించారు. అమ్మవారి సేవలో భక్తులు పరవశించి తరించారు. అమ్మవారికి సాక సమర్పణ, ఊరేగింపులతో బోనాల వేడుక ముగిసింది.
బేగంపేట జూలై 26: లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు పిల్లాపాపలతో కూడివచ్చి బోనాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అధికారులు, అనధికార యం త్రాంగం అంతా బోనాల మహోత్సవాలను ఆది, సోమవారాలు అత్యంత వైభవంగా జరిగేలా చూశారు. రెండో రోజు సోమవారం ఉదయం అమ్మవారికి సాక సమర్పణ, భవిష్యవాణి (రంగం), బలిగంపల సమర్పణ, పోతరాజుల విన్యాసాలు, కళాకారులు – కళారూపాల వేషధారణలు, డప్పుల దరువులు, నృత్య విన్యాసాలు నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. ఏనుగు అంబారిపై అమ్మవారి ఊరేగింపు, పలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు కనుల పండువగా జరిగాయి. మహంకాళి దేవాలయం పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అమ్మవారి ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు, వివిధ వేషధారణలతో చేపట్టిన ఊరేగింపు కోలాహలంగా సాగింది.
అమ్మవారిని ఊరేగింపు అనంతరం, మెట్టగూడలో దేవాలయానికి తరలించారు. ఈ క్రమంలో పోతరాజుల విన్యాసాలు, కళాకారుల వేషధారణలు – హావభావాలు, ఘటాల ఊరేగింపు, డప్పు చప్పుళ్లు హోరు, భక్తుల కేరింతలతో లష్కర్ పుర వీధులన్ని దద్దరిల్లాయి. ఊరేగింపు అనంతరం, భక్తులకు మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమంతించారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారులతో పాటు పురవీధులన్నీ అమ్మవారి నామస్మరణలు, భక్తుల పూజాధికాలతో ఆధ్మాత్మికతను ఆవిష్కరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. సాంస్కృతిక వైభవం ప్రతిబింబిచేలా వివిధ ప్రాంతాలలో కళారూపాలతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిత్ర దర్గా వద్ద ఏర్పాటు చేసిన త్రీడీ లైటింగులు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బోనాల జాతరలో రెండో ఘట్టం రంగం వేడుక (భవిష్యవాణి). కరోనా వైరస్ ప్రభావంతో జాతర 2020లో నిర్వహించలేక పోయారనేది భక్తులందరికీ తెలిసిందే. అయితే, ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారి జాతరను 2021లో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాతర ఉత్సవాలు జరిగాయి. అమ్మవారి భవిష్యవాణి వినేందుకు సికింద్రాబాద్ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత (అవివాహిత) ముఖం నిండా పసుపు పూసుకొని మహంకాళి దేవాలయంలో మాతంగేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట పచ్చికుండపై నిలబడి భవిష్యత్లో జరిగే పరిణామాలను ప్రజల యోగక్షేమాలను వినిపించింది. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
శివ సత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో రెండు రోజుల పాటు అమ్మవారి బోనాల జాతరను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. విచిత్ర వేషధారణలతో తొట్టెల, పలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఆది, సోమవారం రెండు రోజుల పాటు బోనాల పండుగ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అమ్మవారికి భక్తులు ప్రసాదాలు అందించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన ఆటాపాట, నృత్యాలు వివిధ అమ్మవారి రూపాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
వైభవంగా మహాకాళికి బోనాలు జాతర నిర్వహణను ముందుండి నడిపించిన మంత్రి తలసాని
బేగంపేట్ జూలై 26: లష్కర్ ఉజ్జయిని మహాకాళికి బోనాలు ఆది, సోమవారాల్లో వైభవంగా జరిగాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులు బోనం సమర్పించి, మొక్కు లు తీర్చుకున్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన పండుగను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుండి నిర్వహించారు. భక్తులు ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేలా అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ వివిధ శాఖల అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, భక్తుల సహకారంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. మంత్రి నెల రోజుల నుంచే వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేశారు.
‘నా భక్తులను నేనే కాపాడుకుంటా.. నన్ను నమ్మి కొలిచిన భక్తులకు అండగా ఉంటాను. కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రజలంతా నన్ను నమ్మి కొలిచారు. నా భక్తులంతా సంతోషంగా ఉండేలా చూస్తాను. ఎంత పెద్ద ఆపద వచ్చినా వెన్నంటే రక్షణ కవచంలా ఉంటూ కాపాడుకుంటా.. భక్తుల కష్టాల్లో పాలు పంచుకుంటా. వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయి. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది’ అని స్వర్ణలత రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో గుత్తా మనోహర్రెడ్డి దేవాలయం ఫౌండర్ సభ్యులు సురిటి కామేశ్, తదిరులు పాల్గొన్నారు.
అమ్మవారి మరో ఘట్టం గావు (గావు పట్టడం), ఈ క్రమంలో పోతరాజులు చేసిన విన్యాసాలు అబ్బురపర్చాయి. ఆలయం ఎదుట ఆరుగురు పోతరాజుల చేతుల్లో కొరడా పట్టుకుని భక్తులకు కనువిందు కలిగేలా వివిధ రకాల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అమ్మవారి గాంభీర్యంతో భక్తులను అలరింపజేశారు.