ఉగాది వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
శంషాబాద్ రూరల్/అత్తాపూర్/మణికొండ, ఏప్రిల్ 2: కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడమే ఉగాది పండుగ ప్రధాన సందేశమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది పండుగను ప్రతీకగా అభివర్ణించిన ఆయన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ప్రజలు వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకొంటారని వేర్వేరు భాషలు, వేర్వేరు పేర్లు వేర్వేరు సంప్రదాయాల మధ్య ప్రాధాన్యత కలిగిన పండుగగా ఉగాది నిలిచిందన్నారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టులో జరిగిన ఉగాది సంబురాలకు ముఖ్యఅతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ.. ఉగాదితోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమతుందన్నారు. శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాదిని జరుపుకొంటున్న దేశ ప్రజలందరికీ మేలు జరగాలని కోరారు.
ఆకట్టుకున్న వివిధ కార్యక్రమాలు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఉగాది కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు డాక్టర్ శ్రీసాగి కమలాకర శర్మ, ఉగాది ప్రాశస్త్యాన్ని తెలియజేయడంతో పాటు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగు పద్యవైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔత్సాహిక కళాకారిణి కుమారి మన్నె టీనా చౌదరి కూచిపూడి నృత్య ప్రదర్శన, ప్రముఖ వ్యాఖ్యాత చల్లగాలి వెంకట్రాజు, సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టు చైర్మన్ కామినేని శ్రీనివాస్, మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్, కార్యదర్శి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.