హిమాయత్నగర్, డిసెంబర్ 4: డెలివరీ చేయాల్సిన ఖరీదైన వస్ర్తాలతో ఉబేర్ వాహనదారు ఉడాయించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వై జంక్షన్ సమీపంలో ఇర్ఫాన్ఖాన్ టైలరింగ్ దుకాణం నడుపుతున్నాడు. జూబ్లీహిల్స్ నివాసి, ఫ్యాషన్ డిజైనర్ శృతి బాటియా ఇటీవల అతడికి సుమారు లక్ష రూపాయల విలువజేసే బట్టలను కుట్టేందుకు ఇచ్చింది.
ఇర్ఫాన్ఖాన్ కుట్టిన వస్ర్తాలను ప్రత్యేకంగా ఓ బాక్స్లో ప్యాక్ చేశాడు. ఉబేర్ వాహనం బుక్ చేసి జూబ్లీహిల్స్లోని శృతి బాటియాకు ఇవ్వాలని సూచించి పంపించాడు. ఉబేర్ వాహనదారు కస్టమర్కు బట్టలు ఇవ్వకుండానే ఉడాయించాడు. శృతి బాటియాకు బట్టలు అందకపోవడంతో ఇర్ఫాన్ ఖాన్కు ఫోన్చేసి అడిగింది. ఉబేర్ వాహనదారుకు ఫోన్ చేయగా సిచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి ఇర్ఫాన్ఖాన్ ఆదివారం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శిరీష కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.