కుత్బుల్లాపూర్, డిసెంబర్ 25 : సెమీక్రిస్మస్ వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. మార్గమధ్యలో అతివేగంతో డివైడర్ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్-2 దూలపల్లి క్రాస్ రోడ్డు వద్ద నివాసముండే సందీప్(21) శనివారం రాత్రి ఉషాముళ్లపూడి పరిధిలో ఉండే స్నేహితుడు క్రాంతి ఇంట్లో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకలకు వెళ్లాడు.
ఈ వేడుకలకు అతడి డిగ్రీ స్నేహితులైన క్రాంతి, నితిన్, హన్మంత్, కుమార్ కూడా హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా.. క్రాంతి తన ద్విచక్ర వాహనంపై సందీప్ను ఎక్కించుకొని బయలుదేరాడు. నెహ్రూనగర్లో రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్ను అతివేగంతో ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలతో క్రాంతి అక్కడికక్కడే మృతి చెందగా, సందీప్ కొన ఊపిరితో ఉండగా 108లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. సందీప్ తండ్రి ఆవుల కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.