పహాడీషరీఫ్, జూలై 6: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు చెరువులో మునిగి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు చేపట్టి ఒకరి మృతదేహాన్ని నీటిలోనుంచి బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్కు చెందిన షేక్ మహ్మద్ హైదర్ ఖాద్రీ(33) సేల్స్మెన్. షేక్ అంజాద్ (37) పూల వ్యాపారి. జల్పల్లి చెరువు సమీపంలో విందు చేసుకోవడానికి బుధవారం మధ్యాహ్నం ఏడుగురు స్నేహితులతో కలిసి ఆటోలో వచ్చారు.
అందరూ మద్యం తాగారు. అదే మత్తులో సాయంత్రం 4 గంటల సమయంలో ఈత కొట్టడానికి షేక్ మహ్మద్ హైదర్ ఖాద్రీ, షేక్ అంజాద్తోపాటు మరోవ్యక్తి నీటిలో దూకారు. ఒకరు బయటకు రాగా.. వారిద్దరు చెరువులో గల్లంతయ్యారు. వీరి స్నేహితులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, ఇన్స్పెక్టర్ సతీశ్, ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి, గాలింపు చర్యలు చేపట్టారు. హైదర్ ఖాద్రీ మృతదేహం బయటకు తీశారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. గురువారం బాగా చీకటి పడటంతో గాలింపు చర్యలను ఆపివేశారు.