మలక్పేట, జనవరి 22 : దిల్సుఖ్నగర్ బస్ డిపోలో షార్ట్ సర్క్యూట్తో రెండు సిటీ ఎక్స్ప్రెస్ బస్సులు దగ్ధమయ్యాయి. ఎస్ఐ జయంత్, డ్రైవర్ల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటలకు దిల్సుఖ్నగర్-చౌటుప్పల్ రూట్ డ్రైవర్ దేవయ్య డ్యూటీలో భాగంగా టీఎస్ 04 జెడ్ 0170 నంబర్ గల బస్సును బయటికి తీసేందుకు (చౌటుప్పల్కు వెళ్లేందుకు) స్టార్ట్చేసి బాటిల్లో మంచినీళ్లు నింపుకునేందుకు వెళ్లారు. ఇంతలో షార్ట్ సర్క్యూట్తో బ్యాటరీవద్ద స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయి. గమనించిన సహచర డ్రైవర్లు అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పేందుకు యత్నించగా అదుపులోకి రాలేదు.
ఇంతలోనే బస్సు డీజిల్ ట్యాంక్ పేలి పక్కనే ఉన్న మరో బస్సుకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న మలక్పేట పోలీసులు, అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకీ, అడిషనల్ డీసీపీ మనోహర్, ఏసీపీ శ్యాంసుందర్, మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సాయంత్రం వరకు కూడా ఆర్టీసీ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సెక్టార్ ఎస్ఐ జయంత్ తెలిపారు. అయితే రెండు బస్సులు కాలిపోవటంతో సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.