మన్సూరాబాద్, జనవరి 25: అర్ధరాత్రి వేళ కాలనీలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు.. సుమారు పది ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంటలోపే తమ పని ముగించుకున్నారు. దాదాపు రూ. 13 లక్షల విలువైన సొత్తును దోచుకుపోయారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ సూర్యోదయనగర్తోపాటు చంద్రపురికాలనీ రోడ్డు నం. 2ఏ, 2బీ, 3, 4 కాలనీల్లోకి ఇద్దరు దొంగలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2:14 గంటలకు చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకున్నారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఉండేందుకు తలుపులకు బయట నుంచి గడియ పెట్టారు. రోడ్డు నం-2ఏలో ఉన్న శివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దుండగులు.. ముందు రూమ్లో ఉండే విద్యార్థులు బయటకు రాకుండా డోర్కు బోల్ట్ పెట్టారు. ఇంట్లోకి చొరబడి బెడ్ రూములోని బీరువా, సూట్కేసులు, కప్ బోర్డులను పగులగొట్టారు. రూ.75వేల నగదు, 10 తులాల బంగారు నగలు, 25 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు నం-4లోని తాళం వేసి ఉన్న పవన్కుమార్ ఇంట్లోకి చొరబడి.. 10 తులాల బంగారు నగలు, రూ.55 వేల నగదు, ల్యాప్టాప్ను, రోడ్డు నం-2బీలో తాళం వేసి ఉన్న సీఏ ఆఫీస్లోకి చొరబడి రూ.10 వేల నగదు, రోడ్డు నం- 2బీ తాళం వేసి ఉన్న డాక్టర్ ఇంట్లోకి చొరబడి ఒక ల్యాప్టాప్, రెండు సెల్ఫోన్లను, రాజేశ్కుమార్ రెడ్డి, నేపాల్రెడ్డి, మల్లికార్జున్, చారి, వెంకట్రెడ్డి ఇండ్లతో పాటు కొన్ని ప్రైవేటు కార్యాలయాల తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. అదేవిధంగా మన్సూరాబాద్ శ్రీరాంనగర్లోని సాయిబాబా ఆలయంలో నుంచి హుండీని కూడా ఎత్తుకెళ్లారు.
చంద్రపురికాలనీలోని నాలుగు ఇండ్లల్లో 20 తులాల బంగారు నగలు, 25 తులాల వెండి వస్తువులు, ఒక ల్యాప్టాప్, రెండు సెల్ఫోన్లు, రూ.1.40 లక్షల నగదు అపహరణకు గురైంది. చోరీకి గురైన మొత్తం సొత్తు రూ.13లక్షలు ఉంటుంది. మరో ఆరు ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినప్పటికీ ఎలాంటి విలువైన వస్తువులు దుండగులకు లభించలేదు. సీసీ టీవీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో ఇద్దరు దుండగులు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి ముఖానికి చేతి రుమాలు కట్టుకోగా.. మరో వ్యక్తి ఎలాంటి జంకు లేకుండా కాలనీలోని ఇండ్లలోకి ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2:14 గంటలకు కాలనీలోకి చొరబడిన దుండగులు.. 3:07 గంటలకు తమ పని కానిచ్చేసి తాపీగా వెళ్లి పోయారు.
చంద్రపురికాలనీలోని పది ఇండ్లతోపాటు పలు ప్రైవేటు కార్యాలయాల్లో చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీసీపీ సన్ప్రీత్సింగ్కు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అంజిరెడ్డి దొంగతనాలు జరిగిన తీరును వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, సీసీఎస్, క్రైమ్స్ టీమ్లతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాలనీల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగలు నడుచుకుంటూ వచ్చి దొంగతనాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. క్లూస్ టీమ్లను రప్పించి నేరస్తుల ఫింగర్ ప్రింట్లను సేకరించారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, సాధ్యమైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు.
ఈ దొంగతనాలు చేసిన ఇద్దరూ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించినట్లు సమాచారం. వీరిరువురు 2021లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్టు తెలిసింది. ఒక దొంగ పేరును బ్రూస్లీగా గుర్తించినట్లు సమాచారం.