Hyderabad | హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన వీరిద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నుంచి ఏడు నకిలీ జాబ్ లెటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిని మొరచిక్కం సంజీవయ్య అలియాస్ జీవయ్య, ఫిరోజ్ సులేమాన్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. కిరణ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఐలో క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు మహిళల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. ఆ తర్వాత జాబ్ వచ్చినట్లు నకిలీ లేఖలు తయారు చేసి బాధిత మహిళలకు అందజేశారు.
ఆ లేఖలు నకిలీవని తెలియడంతో బాధిత మహిళలు చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం నాడు సంజీవయ్య, ఫిరోజ్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.