కేపీహెచ్బీ కాలనీ, జనవరి 8 : కేపీహెచ్బీ కాలనీ నెక్సెస్ మాల్ చౌరస్తాలో రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్కు చెందిన బన్వరీలాల్ (24), దూరుచంద్ (33) బతుకుదెరువు కోసం నగరానికొచ్చి హైదర్నగర్ జయానగర్లో ప్రెస్టేజి కంపెనీకి కిచెన్ వస్తువులను సరఫరా చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 7న వీరిద్దరూ కేపీహెచ్బీ కాలనీ నెక్సెస్ మాల్లో సినిమా చూసి బైక్పై తిరిగి ఇంటికి వస్తున్నారు.
ఈ క్రమంలో కారులో అల్లోల అగ్రజారెడ్డి (26), మాచవరపు కార్తిక్ (26), చిదన్ తేజ (27) కలిసి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నెక్సెస్ మాల్ చౌరస్తా యూటర్న్ వద్ద రాంగ్ రూట్లో కారులో వస్తూ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న బన్వరీలాల్, దూరుచంద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి రాంగ్ రూట్లో అతివేగంగా నిర్లక్ష్యంగా కారును నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.