వనస్థలిపురం, ఆగస్టు 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూరు పవన్ కల్యాణ్(22), కరీంనగర్కు చెందిన జడ శివానంద్ స్నేహితులు.
వనస్థలిపురం వెంకటరమణకాలనీలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి..హయత్నగర్లో పుట్టిన రోజు పార్టీకి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఎఫ్సీఐ కాలనీ దాటాక వీరి బైక్ అదుపు తప్పి.. రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి ఢీకొట్టడంతో కిందపడిపోయారు. బండి నడుపుతున్న పవన్కల్యాణ్, మధ్యలో కూర్చున్న నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా, శివానంద్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.