Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): దుబాయ్లో ఉన్న సైబర్నేరగాళ్లతో చేతులు కలిపి.. క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మారుస్తున్న ఇద్దరు ఖాతాదారులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర అదనపు సీపీ (క్రైమ్స్) ఏవీ. రంగనాథ్ కథనం ప్రకారం.. గతేడాది అక్టోబర్లో నగరానికి చెందిన ఒక బాధితురాలికి పార్ట్టైమ్ జాబ్ పేరుతో పరిచయమైన సైబర్నేరగాళ్లు యూట్యూబ్లో ‘లైక్ అండ్ సబ్స్ర్కైబ్’ చేయాలని సూచించారు. ఆ తరువాత టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక లింక్ను పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయడంతో మొదట్లో కొన్ని డబ్బులు వచ్చాయి. వాటిని చూసి నిజమని నమ్మిన బాధితురాలు.. సైబర్నేరగాళ్లు చెప్పినట్లు చేసి వాళ్ల చేతిలో రూ. 49,45,900 మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా జానీ జీ.ఎం. మ్యాన్వల్కు చెందిన బ్యాంకు ఖాతాల లింక్లు బయటపడ్డాయి. జానీ జీ.ఎం.మ్యాన్వల్కు దుబాయ్లో ఉండే రైసల్ అనే వ్యక్తి టెలిగ్రామ్ యాప్లో పరిచయమయ్యాడు. ప్రతి రోజు 3000 యూఎస్డీటీ నుంచి 4000 ఎస్డీటీలు బియాన్స్ వాలెట్కు పంపిస్తామని, వాటిని ఇండియన్ రూపాయల్లోకి మార్చి.. తమకు పంపిస్తే కమీషన్ ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా కాసోస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కరెంట్ బ్యాంక్ ఖాతా తెరిచి దుబాయ్లో ఉండే రైసల్కు అప్పగించారు. రైసల్ ట్రేడర్స్ అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసి.. అందులో రైసల్ ఇస్లామ్, అబిను, జానీ, మ్యాన్వల్ను సభ్యులుగా యాడ్ చేశాడు. రైసల్ ఇస్లాం యూఎస్డీటీలను బినాన్స్ వాలెట్కు పంపి.. దాని స్క్రీన్ షాట్ను వాట్సాప్ గ్రూప్లో పెట్టడంతోనే దానిని రూపాయల్లోకి మార్చి మరో ఖాతా ద్వారా ఆ నగదును రైసల్కు తమ కమీషన్లు మినహాయించుకొని పంపిస్తున్నారు. జానీ జీ, మ్యాన్వల్కు చెందిన బ్యాంకు ఖాతాలు దేశంలోని సుమారు 50 సైబర్నేరాలతో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు.