సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా గాలు పటాలు ఎగురవేసే సమయంలో పిల్లల పట్ల జాగ్రతగా ఉండాలని ట్రై కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ప్రజలకు సూచించారు. గడిచిన రెండు రోజుల్లో గాలిపటాలు ఎగురవేస్తూ ఇద్దరు చిన్నారులు సహా ఒక యువకుడు భవనాలపై నుంచి కిందపడి, విద్యుద్ఘాతంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
పిల్లలు భవనాలపైకి ఎక్కి గాలిపటాలను ఎగురవేసే సమయంలో వారి వెంట తప్పనిసరిగా పెద్దవారు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భవనాలపై రేలింగ్ అంచుల వరకు వెళ్లకుండా జాగ్రతలు తీసుకోవాలని, అంతే కాకుండా రేలింగ్ లేని టెర్రస్లపై పిల్లలను అనుమతించవద్దని పోలీసులు సూచించారు. అంతే కాకుండా భవనాల పక్కన విద్యుత్ తీగలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి భవనాలపైన పిల్లలు లేదా పెద్దలు గాలిపటాలను ఎగురవేయరాదని అన్నారు.