శంషాబాద్ రూరల్, జూన్ 13 : శంషాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి వీస్తున్న గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నర్కూడ గ్రామంలో మల్లేష్యాదవ్ అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. గతకొంతకాలం నుంచి విద్యుత్ తీగలు సరి చేయాలని సంబంధిత అధికారులను రైతులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే బర్రెలు మృతి చెందినట్లు రైతు మల్లేష్యాదవ్ తెలిపారు.
విద్యుత్ షాక్తో గేదెలు మృతి చెందడంతో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని వివరించారు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు ఘటన స్థలానికి చేరుకొని గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రైతును ఆదుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్షాక్తో గేదెలు మృతిచెంది నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ శేఖర్యాదవ్ రైతును పరామర్శించారు. దీంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో కురిసిన భారీ వర్షంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈసీవాగులోకి వరదనీరు భారీగా చేరి హిమాయత్సాగర్ చెరువులోకి చేరాయి. శంషాబాద్ పట్టణంలోని పాత పోలీస్స్టేషన్ భవనం సమీపంలో శితిలావస్థకు చేరిన గోడ కూలిపోయి పార్కింగ్ చేసిన కారుపై పడడంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సమయంలో మరోసారి భారీ వర్షం కురియడంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.