సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): జలమండలికి మరో రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఇప్పటికే పౌర సంబంధాల విభాగంలో అందించిన సేవలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్న జలమండలి తాజాగా మరో రెండింటిని తమ ఖాతాలో వేసుకున్నది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా( పీఆర్ఎస్ఐ) జాతీయ స్థాయిలో కార్పొరేట్ వెబ్సైట్, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం వంటి వివిధ కేటగిరిల్లో పలు పోటీలు నిర్వహించింది. ఇందులో ఉత్తమ కమ్యూనికేషన్ క్యాంపెయిన్, ప్రజా అవగాహన విభాగాల్లో జలమండలి వరుసగా మొదటి, మూడో బహుమతి గెలుచుకున్నది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన పీఆర్ఎస్ఐ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో ఆ రాష్ట్ర వైద్య విద్య మంత్రి కైలాశ్ విశ్వాస్ సారంగ్ ఈ అవార్డులను అందజేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ, ఎల్అండ్టీ, మంగళూరు రిఫైనరీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, హెచ్ఎంఆర్, భారత్ పెట్రోలియం, ఐటీసీ తదితర ప్రముఖ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా..జలమండలికి రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జలమండలి పౌర సంబంధాల విభాగం బృందాన్ని సంస్థ ఎండీ దానకిశోర్ అభినందించారు.