సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మా వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ రెండు తెలుగు రాష్ర్టాలలో 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి, మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం సీసీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్, సీసీఎస్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. విజయవాడకు చెందిన గుడే రాంబాబు, భీమవరానికి చెందిన పెనమెట్స కృష్ణంరాజు వ్యాపార భాగస్వాములు. లాభాలు రావడంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించారు.
ఇందుకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయం తీసుకున్నారు. మొదట్లో మూవింగ్ కన్జుమర్ గూడ్స్ను విక్రయిస్తూ, ఆ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. ఇందుకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు సేకరించారు. పెట్టుబడి పెట్టిన వారికి తొలుత కొన్ని నెలలు 6 శాతం లాభాల చెల్లించారు. ఇలా దాదాపు 200 మంది నుంచి రూ. 530 కోట్లు వరకు వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు. వ్యాపారాన్ని గొలుసు కట్టు విధానంలోకి మార్చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి ఇటీవల లాభాలు చెల్లించడంలో ఆలస్యం చేశారు.
దీంతో బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో మాదాపూర్లో ఉన్న ఇంటికి తాళం వేసి.. నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గచ్చిబౌలిలో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఏపీ, తెలంగాణలో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.