మన్సూరాబాద్, మార్చి 2: అక్రమంగా గంజాయి రవాణ చేస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో అబ్ధుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 41, 21, 500 లక్షల విలువైన 164.86 కేజీల గంజాయి, కియా కారు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అనురాధ వివరాలు వెల్లడించారు. ఒడిస్సాకు చెందిన నబీన్ సబర్ (28) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఒడిస్సాకే చెందిన సుధాకర్ మండల్ (27) కూడా వృత్తిరీత్య డ్రైవర్. ఇద్దరు డ్రైవర్లు కావడంతో స్నేహం ఏర్పడింది.
జల్సాలకు అలవాటుపడిన నబీన్ సబర్, సుధాకర్ మండల్కు డ్రైవింగ్ చేయగా వచ్చే డబ్బులు సరిపడక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీరికి ఒక డ్రగ్ పెడ్లర్ పరిచయం అయి తనతో కలిసి పని చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తానన్నాడు. కారులో ఒడిస్సా నుంచి మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తే.. ఒక్కో ట్రిప్నకు రూ. 60 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కర్నాటకకు ఇప్పటికే రెండు సార్లు గంజాయి రవాణా చేశారు. తిరిగి మరోసారి గంజాయి తీసుకుని (ఏపీ39 క్యూఆర్2975) హైదరాబాద్కు బయలుదేరారు. నబీన్ సబర్, సుధాకర్ మండల్ కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న విషయం ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు తెలిసి విషయాన్ని అబ్ధుల్లాపూర్మెట్ పోలీసులకు తెలిపారు.
ఎస్ఓటీ పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. అబ్ధుల్లాపూర్మెట్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం. 11 వద్ద కారులో తీసుకువస్తున్న గంజాయిని వేరే వారికి అప్పగించాల్సి ఉంది. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలోని నల్గొండ ధర్మ కాంట వద్దకు వచ్చిన కారును పోలీసులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు కారు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన నబీన్ సబర్, సుధాకర్ మండల్ను రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఓటీ మల్కాజిగిరి డీసీపీ మనోహర్, అడిషనల్ డీసీపీ ఎన్. నర్సింహారెడ్డి, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ఎస్ఓటీ-1 ఏసీపీ అంజయ్య, ఇన్స్పెక్టర్లు అశోక్రెడ్డి, కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.