సిటీబ్యూరో/చర్లపల్లి, జూలై 10 (నమస్తే తెలంగాణ): నమ్మకమే పెట్టుబడిగా రూ.50 కోట్లు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. స్విట్జర్లాండ్కు వెళ్తున్నామని ఇంట్లో నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటూ చంద్రశేఖర్ కూతురు.. చర్లపల్లి పీఎస్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అధిక వడ్డీ ఆశచూపి రూ.50 కోట్ల వరకు వసూలు చేసిన సిమెంట్ వ్యాపారి చంద్రశేఖర్ ఇంటికి తాళం వేసి బిచాణా ఎత్తేశాడంటూ బాధితులు పదిరోజుల క్రితం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులోనే జూన్ 22 నుంచి చంద్రశేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని, వారి పిల్లలను వాకబ్ చేస్తే స్విట్జర్లాండ్ వెళ్లారంటూ చెబుతున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. బాధితుల ఫిర్యాదు అనంతరం పోలీసులు చంద్రశేఖర్ కోసం ఆరా తీస్తున్నారు. చంద్రశేఖర్ దంపతులు విదేశాలకు వెళ్లారా? లేదా? అనే విషయాలు కూడా స్పష్టత లేదంటూ బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ కూతురు.. తన తల్లిదండ్రులు కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేయడంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాలలో కేసు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.