Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ను ఆమెనే రాయదుర్గం పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించినట్లు తెలిసింది. సురేందర్ సోదరి గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్లకు పాల్పడి డబ్బులు గుంజినట్లు పోలీసులు గుర్తించారు.
జనవరి 4వ తేదీన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సురేందర్ను కొంతమంది దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఆ తర్వాత బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. అయితే హైదరాబాద్ నడిఒడ్డున కిడ్నాప్ జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేందర్ను కిడ్నాపర్లు రాయదుర్గం నుంచి నల్లమల అడవులకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో వారిని ఫాలో అయిన పోలీసులు కర్నూలులోని ఆత్మకూరు దగ్గర సురేందర్ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.