ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ఒక ఫ్లాప్ షోగా మారిందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని దుయ్యబట్టారు. అదేవిధంగా, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని, నమ్మబోరన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుంగ బాలు మాట్లాడుతూ.. రేవంత్ దీక్షకు ప్రజల నుంచి స్పందన కరువైందన్నారు.
జనసమీకరణకు భారీ ఏర్పాట్లు చేసి, ఒక్కొక్కరికీ నగదు, అన్నం పొట్లం ఇచ్చినా ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. వచ్చిన ప్రజలు కూడా కనీసం రేవంత్ ప్రసంగం అయ్యే వరకు వేచిచూడకుండా తిరుగుముఖం పట్టారని చెప్పారు. దీక్షకు ఆయన సొంత పార్టీ నాయకుల నుంచే మద్దతు కరువైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో రూ.69 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు దాదాపు 98 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయినా, సీఎం దత్తత గ్రామంలో రేవంత్ దీక్ష పెట్టి మసి పూసి మారేడుకాయ చేద్దామనుకుంటే ప్రజల నుంచి గోబ్యాక్ నినాదాలు వచ్చాయని తెలిపారు. అదే ప్రజలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారని పేర్కొన్నారు.
దళితుల అభ్యున్నతికి కోట్ల రూపాయలు వెచ్చించి, దళిత వాడలను మేడలుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకుసాగుతున్నారని తుంగ బాలు కొనియాడారు. దళిత, గిరిజన విద్యార్థులు, యువకులకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. పరిస్థితులు చూస్తే పాత నాణానికి గీతలెక్కువ.. ఏమీలేని విస్తరుకు ఎగురుడు ఎక్కువ.. రేవంత్రెడ్డికి మొరుగుడు ఎక్కువ.. అన్నట్లుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారని తుంగ బాలు అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేశ్ గౌడ్, చందు, నాయకులు ఎర్రవండ్ల కృష్ణ, నవీన్, మధు, దశరథ్, శశిపాల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు తమ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని తుంగ బాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని మండిపడ్డారు. ఒక్కో గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపేణా కేవలం రూ.21లను ప్రజలపై మోపుతుండగా, బీజేపీ నాయకులు మాత్రం రూ.291లను ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తున్నదంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజం అయిపోతుందని నమ్ముతూ, గ్యాస్బండపై పన్ను అంశాన్ని ఎమ్మెల్యే రఘునందన్రావు విలేకరుల సమావేశంలో నిస్సిగ్గుగా పునరావృతం చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర పరిధిలోని పన్నులను తగ్గిస్తే ధరలు తగ్గుతాయని చెబుతున్న రఘునందన్రావుకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పన్నులు తగ్గించే దమ్ము ఉందా.. అని ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తమ అజ్ఞానాన్ని బీజేపీ నాయకులు చాటుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అబద్ధాలు ప్రచారం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్లుగా రఘునందన్రావు, రేవంత్రెడ్డి పోటీ పడుతున్నారని మండిపడ్డారు.