Gruha Jyothi | బడంగ్పేట, ఏప్రిల్ 11: ఆరు గ్యారెంటీల ఆశతో ఆశల పల్లకిలో ఉన్న లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కారు అట్టహాసంగా ప్రకటించి, అమలు చేశామంటున్న గృహజ్యోతి ’‘చూసి మురవ..చెప్పుకొని ఏడవ’.. అన్నట్లుగా తయారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు గందరగోళంతో నగర శివారుల్లోని పలు కార్పొరేషన్ల పరిధుల్లో కొన్ని కాలనీల్లో గృహజ్యోతి పథకాన్ని అమలు చేశారు. జీరో బిల్లును జారీ చేసి లబ్ధిదారులకు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నదని ఉన్నతాధికారులు ఆపేయమనడంతో వెంటనే నిలిపివేశారు. ఈలోగా జారీ చేసిన జీరో బిల్లులను అందుకున్న లబ్ధిదారులు ఎంతో సంబురపడ్డారు.
కానీ వాళ్ల ఆనందం.. నెల రోజుల్లోనే ఆవిరైంది. తాజాగా ఈ నెల జారీ చేసిన కరెంటు బిల్లుల్లో గత నెల బిల్లులను కూడా జోడించిన అధికారులు.. లబ్ధిదారులకు ఝలక్ ఇచ్చారు. దీంతో ఇదెక్కడి అన్యాయమంటూ నిరుపేదలు లబోదిబోమంటున్నారు. వినియోగదారులు కొందరు తమ ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకోవడం వైరల్గా మారింది. తీరా… ఆరా తీస్తే ఒకరిద్దరురూ కాదు.. వేలల్లోనే లబ్ధిదారులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలు మూడడుగులు ముందుకు… ఆరడుగులు వెనక్కి అన్నట్లు తయారయ్యాయి. ఆరు హామీల్లో భాగమంటూ ప్రారంభించిన మహాలక్ష్మి పథకం కింద రూ. 500 గ్యాస్ సిలిండర్ అసలు అమలవుతుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇక.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకమైన గృహజ్యోతి ఓ ప్రహసనంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోకి వచ్చే ఉమ్మడి రంగారెడ్డిలో పథకం అమలు గందరగోళానికి దారి తీసింది.
ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి గత ఫిబ్రవరి 27న ప్రారంభించగా… విద్యుత్ శాఖ అధికారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ మార్చి నెల కరెంటు బిల్లుల జారీలో పథకాన్ని అమలు చేశారు. వందలాది మందికి జీరో బిల్లులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందంటూ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే నిలిపివేసి, సాధారణ బిల్లులు జారీ చేశారు. జీరో బిల్లులు అందుకున్న వారికి తిరిగి సాధారణ బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు మురిసిపోయారు. కానీ నెల తిరిగేసరికి వచ్చిన తాజా కరెంటు బిల్లులు చూసి షాక్ అయ్యారు. గత నెల జారీ చేసిన జీరో బిల్లుల్లోని మొత్తాన్ని కూడా తాజా బిల్లుతో జోడించి ఇవ్వడంతో లబ్ధిదారులు నోరెళ్లబెట్టారు. ఒకసారి రెండు నెలల బిల్లులు ఎలా చెల్లించాలంటూ లబోదిబోమంటున్నారు.
తాజా కరెంటు బిల్లుల్లో గత నెల బిల్లును కూడా జోడించి ఇవ్వడంతో నిరుపేదలు ఆందోళనకు గురయ్యారు. మహేశ్వరం లెనిన్నగర్కు చెందిన వినియోగదారులు కొందరు ఎక్స్ వేదికగా తన కరెంటు బిల్లులను జోడిస్తూ ఆవేదనను పోస్టు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉలిక్కిపడిన చంపాపేట్ విద్యుత్ శాఖ అధికారులు ఆ పోస్టును తొలగించాలంటూ లబ్ధిదారుడు నర్సింగ్రావును బతిమిలాడారు. ఇతనికే కాదు… మీర్పేట పరిధిలోని లెనిన్నగర్, ప్రశాంత్నగర్, చింతల్కుంటతో పాటు బడంగ్పేట పరిధిలోని మల్రెడ్డి రంగారెడ్డి నగర్, జయశంకర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, రాజీవ్ గృహకల్ప, అల్మాస్గూడ పాతబస్తీ ఇలా అనేక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. రెండు నెలల బిల్లు ఒకేసారి రావడం ఒకవంతైతే… అధికారుల తప్పిదానికి సైతం లబ్ధిదారులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. గత నెల బిల్లు కట్టనందుకు అదనంగా రూ.25 సర్చార్జీని కూడా తాజా బిల్లుల్లో జోడించడం మరో కొసమెరుపు.
కాంగ్రెస్ అధికారం కోసం ఆరు గ్యారెంటీలు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రజలు ఎవరూ కూడా మాకు ఇది కావాలని అడుగలేదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మార్చి నెలలో 200 యూనిట్లు వచ్చిన వారికి జీరో కరెంటు బిల్లులు ఇచ్చి పోయారు. ఏప్రిల్ నెలలో మరోసారి రెండు నెలల బిల్లు ఇచ్చారు. అదే కాకుండా పెనాల్టీ కింద 25 రూపాయలు వేశారు. ఏ నెలకు ఆ నెల బిల్లు కట్టుకోవడం కష్టమంటే రెండు నెలలకు సంబంధించిన బిల్లులు కట్టమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. లేదంటే కరెంటు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చి పోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది మరోలా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు.
– ముత్యాల నర్సింహ, జయశంకర్ కాలనీ, అల్మాస్గౌడ
మొదట ఇక నుంచి కరెంటు బిల్లు కట్టనవసరం లేదన్నారు. ఇప్పుడేమో రెండు నెలల బిల్లులు కట్టమంటున్నారు. విద్యుత్ బిల్లు తగ్గించమని గాని, ఉచితంగా ఇవ్వమని గాని అడిగామా? ఎందుకు మోసం చేయడం, బిల్లులు కట్టపోతే కరెంటు ఉండదంటున్నారు. పేదోళ్లను మోసం చేస్తున్నారు. మాట ఇచ్చి తప్పుతున్నారు. ఓట్లు వేసిన తర్వాత మాట మార్చారు. పై నుంచి మాకు ఆర్డర్ రాలేదని కరెంటోళ్లు చెబుతున్నారు. ఏ నెలకు ఆ నెల బిల్లు కట్టుకునే వాళ్లం. ఇప్పుడు కొత్త కథ చెప్పి రెండు నెలల బిల్లు పంపించారు.
– వరిసే వెంకటమ్మ, అల్మాస్గూడ, జయ శంకర్ కాలనీ
మొదట జీరో కరెంటు బిల్లు ఇచ్చారు. ఇప్పుడు రెండు కలిపి బిల్లు కంటమంటే ఎలా అంటే.. ఎవరికీ చెప్పవద్దని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అధికారుల తీరు బాగలేదు. నమ్మించి మోసం చేస్తున్నారు. మాకు ఉచితంగా కరెంటు ఇవ్వని మేము ఎప్పుడు అడగలేదు. వారే చెప్పిండ్రు. ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. గతం కన్నా.. విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పైన అడుగమంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి.
– శ్రీనివాస్, లబ్ధిదారుడు
మార్చి నెలలో చాలా మందికి విద్యుత్ అధికారులు జీరో బిల్లులు ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఎన్నికల వాగ్ధానంలో చెప్పారు. చాలా మంది మా మిత్రులకు జీరో బిల్లు వచ్చిందని సంతోషపడ్డారు. మార్చి నెలలో సంతోషపడితే ఏప్రిల్లో రెండు బిల్లులు కలిపి వచ్చిందని చెప్పారు. ఇది మోసం అనుకొని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాను. మార్చి , ఏప్రిల్ నెలల బిల్లులను కలిపి పోస్టు చేశాను. చంపాపేటకు చెందిన విద్యుత్ అధికారులు ఆ పోస్టు తీసేయమని బతిమిలాడారు. మా ఉద్యోగాలు పోతాయని మొర పెట్టుకున్నారు. దీంతో పోస్టును తొలగించాను. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద మోసం.
– నర్సింగ్ రావు, మీర్పేట, (ఎక్స్లో పోస్టు చేసిన వ్యక్తి)