TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మరో కొత్త మార్గంలో సిటీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయాధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు కొత్తగా ఆరు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు.
ఈ బస్సులు ప్రతి రోజూ 24 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. ఈ నెల 26 నుంచి కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ప్రెస్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ప్రాంతీయ అధికారి వెల్లడించారు. మేడ్చల్ నుంచి మెహిదీపట్నం వరకు ఉదయం 6:40 గంటల నుంచి మొదలు రాత్రి 7:20 గంటల వరకు, మెహిదీపట్నం నుంచి మేడ్చల్కు ఉదయం 8:20 గంటల నుంచి రాత్రి 9:05 గంటల వరకు తిరుగుతాయన్నారు. ఈ మార్గంలో తిరిగే ప్రయాణికులు సౌకర్యం కోసం కొత్తగా ఈ మెట్రో సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకోవాలని కోరుతున్నామన్నారు.