భారీగా పుంజుకున్న ఆదాయం
రూ.1.50 కోట్ల నుంచి రూ.3.50 కోట్లు రాక
మార్చిలో రూ.100 కోట్లు ఆర్జన
నిత్యం 22 లక్షలమంది రాకపోకలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సాధారణ జనజీవనం నెలకొనడంతో నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆదాయం అనూహ్యంగా పుంజుకుంది. కరోనా సమయంలో రోజుకు గరిష్టంగా రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.3.50 కోట్ల వరకు వస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. రోజుకు రూ.2 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందన్నారు. ఫిబ్రవరిలో ఆర్టీసీ గ్రేటర్ జోన్కు రూ.93.73 కోట్లు రాగా, మార్చి మాసంలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 50 కోట్లకు పైగానే రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రోజుకు 22 లక్షల మంది ప్రయాణికులు
కరోనా సమయంలో నిత్యం 5 లక్షల మంది ప్రయాణించగా, ఇపుడు గ్రేటర్వ్యాప్తంగా 22 లక్షల మంది బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో బస్పాస్లు కలిగిన వారు 10 లక్షల మంది ఉన్నారు. 29 డిపోల పరిధిలో దాదాపు 2900 సిటీ బస్సులు నడుపుతున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జానకీరామ్ తెలిపారు.
హారన్లు నియంత్రిస్తాం
నగరంలో మోతాదుకు మించి డ్రైవర్లు హారన్లను ఉపయోగించడంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి అన్నారు. బస్సు హారన్లకు 80 డెసిబుల్ ఉండేలా నియంత్రిస్తామన్నారు. ఆర్టీసీ డ్రైవర్లందరికీ దశలవారీగా హారన్ల ఉపయోగంపై ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు.
బస్సు హారన్లతో బేజార్
జంటనగరాల్లో ఆర్టీసీ బస్సుల హారన్ల మోతతో జనం బేజారవుతున్నారు. అధిక శబ్దాలతో చెవులు అదిరిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. మోటారు వాహన చట్టం ప్రకారం..80 డెసిబుల్ వరకు హారన్ మోగించాలి. దీన్ని పట్టించుకోని కొందరు డ్రైవర్లు 110 డెసిబుల్ వరకు మోగిస్తుండడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా సిటీ బస్సులతోపాటు జిల్లాల నుంచి వచ్చే బస్సు డ్రైవర్లు త్వరగా గమ్యం చేరాలని హారన్లు ఉపయోగిస్తున్నారు. ఇటీవల బండ్లగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శబ్దకాలుష్యంపై ఒకరు ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎండీ శబ్దకాలుష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బండ్లగూడ డిపో మేనేజర్ను ఆదేశించారు. హారన్ల ఉపయోగం, ప్రజల ఇబ్బందులపై ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.