సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమన్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ.. శనివారం నగరవాప్త్యంగా నిరసనలతో హోరెత్తించారు. డిపోల వద్ద రెండు గంటల పాటు బస్సులను నిలిపివేసి.. ఆందోళన చేశారు. అనంతరం వందలాది మంది కండక్టర్లు, డ్రైవర్లతో కలిసి ఆర్టీసీ టీఎంయూ సంఘం ఆధ్వర్యంలో రాజ్భవన్ను ముట్టడించి, అక్కడే బైఠాయించారు. అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బస్భవన్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీగా రాజ్భవన్కు చేరుకున్నారు. విలీన బిల్లును అడ్డుకోవద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఉపాధ్యక్షులు మారయ్య, నిర్మలా రెడ్డి, టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, థామస్రెడ్డి, ఉపాధ్యక్షులు జీపీఆర్రెడ్డి, ముఖ్య సలహాదారులు యాదయ్య, కోశాధికారి రాఘవరెడ్డి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట ఉద్యోగులు ఆందోళన చేశారు. మేడ్చల్, కుషాయిగూడ, ఉప్పల్, చెంగిచెర్ల, కూకట్పల్లి, జీడిమెట్ల, హకీంపేట్ డిపోల వద్ద ఉదయం 6 నుంచి 8 గంటల వరకు బస్సులను డిపోలకే పరిమితం చేశారు.దిల్సుఖ్నగర్ డిపో ప్రధాన ద్వారం వద్ద టీఎంయూ డిపో కార్యదర్శి వెంకటయ్య, వెల్ఫేర్ కమిటీ సభ్యుడు జీఎన్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు నిరసన తెలిపారు.