సికింద్రాబాద్, సెప్టెంబర్ 25: రాణిగంజ్,కంటోన్మెంట్ డిపోలకు సంబంధించిన పార్సిల్ కార్గో కొరియర్ సర్వీసులను వ్యాపారస్తులకు అందుబాటులో ఉండే విధంగా 24గంటలు సర్వీసులు అందిస్తున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ జగన్ పేర్కొన్నారు. శనివారం టీఎస్ ఆర్టీసీ రాణిగంజ్, కంటోన్మెంట్ డిపోల ఆధ్వర్యం లో కార్గో పార్సిల్ సర్వీసులను బైబిల్హౌస్ రాణిగంజ్ వద్ద డివిజనల్ మేనేజర్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణిగంజ్ డిపోకి సంబంధించిన జేమ్స్ స్ట్రీట్ టూరిజం,మహంకాళి, బైబిల్ హౌస్, రాణిగంజ్ డిపో, మినర్వా, రేతి ఫైల్ బస్స్టేషన్, కంటోన్మెంట్ డిపోకి సంబంధించిన జూబ్లీ బస్స్టేషన్, సంగీత్ చౌరస్తా, తార్నాక,మల్కాజిగిరికి సంబంధించిన కార్గో పాయింట్ల వద్ద ఉద్యోగస్తులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు.వ్యాపారస్తులకు కార్గో పార్సిల్ కొరియర్ సర్వీసులు నిరంతరం కొనసాగిస్తామన్నారు. మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్లలో వ్యా పారస్తులకు సకాలంలో సర్వీసులు అందిస్తామని తెలిపారు.వ్యాపారస్తులతో పాటు ప్రజలు ఆర్టీసీ కార్గో పార్సిల్ కొరియర్ సర్వీసులు 24గంటలు అందుబాటులో ఉంటాయని, ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం రాణిగంజ్ డిపోకి సంబంధించిన ఫోన్ నంబర్లు9154298860, 9154298859,కంటోన్మెంట్ డిపోకి సంబంధించిన ఫోన్ నంబర్ 9866234056ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు భీమ్రెడ్డి, సుధాకర్, కృష్ణమూర్తి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు భరత్ కుమార్, రామారావు, పావని, సుబ్రహ్మణ్యం, మూర్తి, పాకాల ప్రభాకర్ పాల్గొన్నారు.