హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC)శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో త్వరలోనే సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాల్లో గంటల సమయం ప్రయాణించి ప్రస్తుతం కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక బస్సులతో తక్కువ వ్యయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగనున్నది.
ప్రస్తుతం సర్వీసులను నడిపేందుకు ఆన్లైన్ ద్వారా ఐటీ ఉద్యోగుల అభిప్రాయాలను టీఆర్ ఆర్టీసీ సేకరిస్తున్నది. దీంతో ఐటీ కారిడార్లో మరిన్ని షటిల్ సర్వీసులను పెంచనున్నది. ఈ షటీల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI లింక్పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ కోరింది. ఉద్యోగులు కంపెనీ వివరాలు, లోకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను తెలుపడంతో పాట సలహాలు సూచనలు ఇవ్వాలని కోరింది. ఉద్యోగులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే ప్రత్యేక షటిల్ సర్వీసుల ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ తెలిపింది. సేవలను సులభంగా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నది.
ఇందులో భాగంగా ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందిస్తున్నది. ఆ యాప్లోనే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీనికి తోడు సర్వీస్లకు ట్రాకింగ్ సదుపాయం ఉన్నది. బస్ ఎక్కడ ఉంది? ఏయే ప్రాంతాల్లో తిరుగుతుంది? అనే వివరాలు తెలుసుకోవచ్చు. మహిళల భద్రతా నేపథ్యంలో షటిల్ బస్లకు ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆ యాప్లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.