మియాపూర్, జనవరి 22: ప్రారంభించిన అనతి కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు మంచి స్పందన నెలకొంటుంది. ఉచిత విద్య, కార్పొరేట్ తరహాలో అధ్భుతమైన వసతులు మరెన్నో సౌకర్యాలను కల్పిస్తూ విద్యతో పాటు క్రీడలు ఇతర అంశాలలో శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల తనదైన ముద్ర వేస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను ప్రకటన విడుదల కావటంతో.. ఈ అవకాశాన్ని మైనార్టీ సహా ఇతర విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఇక్కడి పాఠశాల ప్రిన్సిపాల్ చందర్రెడ్డి నేతృత్వంలో సిబ్బంది తమ వంతుగా స్థానికంగా తగు ప్రచా రం చేస్తున్నారు. మరో పక్క ఈ విద్యాసంవత్సరంలో ఇక్కడి పాఠశాలకు ఎన్సీసీ సైతం మంజూరు కావటంతో ఈ అంశంతో పాటు మైనార్టీ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు నాణ్యమైన విద్య ప్రధానాంశాలే ప్రచారంగా సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలతో పాటు కళాశాల సైతం కొనసాగుతుండగా.. గ్రూపులు వాటిల్లోని సీట్లను వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఇవిగో సీట్ల సంఖ్య.. ఇలా దరఖాస్తు..
2016 జూన్ 26న శేరిలింగంపల్లి మండల మైనార్టీ పాఠశాలను హైదర్నగర్లో ఏర్పాటు చేశారు. గడచిన ఏడు సంవత్సరాలుగా మంచి ఫలితాలలో పాఠశాలకు ముందుకు సాగుతున్నది. కాగా 2023-24 విద్యాసంవత్సరానికి బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలోఐదవ తరగతిలో మొత్తం 80సీట్లకుగాను 60 సీట్లు మైనార్టీలకు, 20 సీట్లు ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఓసీ వర్గాలకు కేటాయించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 30 సీట్లు మైనార్టీలకు, 10 సీట్లు ఇతర వర్గాలకు కేటాయించారు. వీటితో పాటు 6,7,8 తరగతులలో పరిమిత సంఖ్యలో మైనార్టీ సీట్లు సైతం అందుబాటులో ఉన్నా యి. అయితే ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది.www.tmreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
హైదర్నగర్లోని పాఠశాలలోనూ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటును కల్పించారు. ఈ పాఠశాలో ఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ సైతం మంజూరైన నేపథ్యంలో కఠినమైన అభ్యసనతో కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు సర్టిఫికెట్ సైతం అందిస్తారు. ఎన్సీసీ సర్టిఫికెట్పై చదువులతో పాటు ఉద్యోగాలలోనూ తగు ప్రాధాన్యతగా ఉపయోగపడుతుంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 మైనార్టీ గురుకుల పాఠశాలలకుగాను 5 బాలురవి కాగా.. హైదర్నగర్ పాఠశాలకు మాత్రమే ఎన్సీసీ మంజూరు కావడంతో దీనిని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా కల్పిస్తున్న నాణ్యమైన విద్య ఎన్సీసీ సహా ఇతర వసతులను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ చందర్రెడ్డి కోరారు. మరిన్ని వివరాలకు 7331170805 నంబర్లో సంప్రదించాలని ఆయన తెలిపారు.