హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో గల తన కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దళితబంధు నిధులతో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను కేటాయించామన్నారు. మిగిలిన లబ్ధిదారులకు జూన్ 10 వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ ల సమక్షంలో యూనిట్లను అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ ను మంత్రి ఆదేశించారు.
రెండో విడత దళితబంధు కార్యక్రమం అమలు కోసం బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1000 మందికి చొప్పున ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. ఇందుకు గాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పథకం అందేవిధంగా చూడాలని అన్నారు.
దళితబంధు ఒక గొప్ప కార్యక్రమం ..
పేదరికాన్ని అనుభవిస్తున్న దళితులు ఆర్థికాభివృద్దిని సాధించడానికి దళిత బంధు పథకం ఎంతో మేలు చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసించారు. రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నందున దరఖాస్తుల స్వీకరణ, యూనిట్ల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
అనేకమందికి ఉపాధి అవకాశాలు..
దళితబందు పథకంతో అనేకమంది దళితులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాలు పేర్కొన్నారు. అర్హులైన దళితులకే ఈ పథకం వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణిదేవి, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.