సిటీబ్యూరో, అక్టోబరు 25(నమస్తే తెలంగాణ): అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తోంది. హెచ్ఐసీసీ వేదికగా జరిగిన పార్టీ 20వ ప్లీనరీ విజయవంతం కావడంతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్లీనరీలో అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇదే జోష్తో మరింత చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
పార్టీ అధినేతగా తొమ్మిదో సారి కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ ప్రసంగంతో తమలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, రాబోయే రోజుల్లో రెట్టింపైన ఉత్సాహంతో క్రియా శీలకంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 15న వరంగల్లో జరిగే పార్టీ విజయ గర్జనను విజయమే ధ్యేయంగా ముందడుగు వేయనున్నారు.
రేపు బుధవారం గ్రేటర్ అంతటా సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరిపి శ్రేణులను సన్నద్దం చేయనున్నారు. డివిజన్ల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి విజయగర్జనకు భారీగా తరలేలా సమాయత్తమవుతుండటం గమనార్హం.