‘దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం. బలమైన బలగంతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో కలిపి 6 లక్షల పదవులు భర్తీ కాబోతుండగా, గ్రేటర్ నుంచి లక్ష మందికి అవకాశం దక్కుతుంది. వచ్చిన పదవిని బాధ్యతగా భావించి వన్నె తీసుకరండి. బుధవారం నుంచి కమిటీల నియామకం ప్రారంభించి, 20లోపు పూర్తి చేయాలి. దీపావళి తర్వాత నూతన కమిటీలకు శిక్షణ ఉంటుంది’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మంత్రి కేటీఆర్ చెప్పారు. పార్టీ నగర సర్వసభ్య సమావేశం మంగళవారం జలవిహార్లో జరిగింది. మంత్రి కేటీఆర్ విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నట్లు, హైదరాబాద్ జిల్లాలో కూడా టీఆర్ఎస్ ఆఫీసు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షుల ఎంపిక పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు అధ్యక్షతన కమిటీ నిర్ణయం తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం ప్రకటిస్తామన్నారు.
పార్టీ నగర సర్వసభ్య సమావేశం సందర్భంగా పీవీ మార్గ్లోని జలవిహార్ గులాబీమయమైంది. భారీ కటౌ ట్లు, జెండాలు, అడుగడుగునా బ్యానర్లతో కొత్త కళ వచ్చింది. నగర పార్టీ శ్రేణులంతా కదిలిరావడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
లోగ్ సాత్ ఆతే గయే.. ఔర్ కార్వాన్ బన్తా గయా అన్నట్టు… 2001లో ఉద్యమ నాయకుడిగా గులాబీ జెండా చేతబట్టి ఒక్కడుగా బయలుదేరి..ఇంతితై వటుడింతై అన్నట్టు…ఒక మహాసముద్రానికి ఉప్పెన మాదిరిగా..టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు అన్నారు. పీవీ మార్గ్లోని జలవిహార్లో జరిగిన గ్రేటర్ టీఆర్ఎస్ సంస్థాగత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలు ఆయన మాటల్లోనే…
సిటీబ్యూరో, సెప్టెంబరు 7(నమస్తే తెలంగాణ): మహానగరంలో టీఆర్ఎస్ పార్టీ మరింతగా బలోపేతం అయ్యేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుడుగు వేస్తోంది.నాయకత్వ స్థానాల్లో పార్టీ క్రియాశీల సభ్యులను నియమించనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు విధివిధానాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేవలం గ్రేటర్లోనే లక్ష మందికి నాయకత్వ పదవులు దక్కుతాయని ప్రకటించారు.
పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత గౌరవం ఇస్తామని, ఎక్కడ ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తీసుకువచ్చే విధంగా నాయకులు పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా ఈ సారి కొత్తగా సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని తెలిపారు. 20వ తేదీ వరకు బస్తీ, కాలనీ కమిటీలను పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. నెలాఖరు నాటికి జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలు, రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పిస్తామన్నారు.
4,500 నామినేటెడ్ పోస్టులలో గ్రేటర్ నేతలకు సముచిత అవకాశం కల్పిస్తామని కేటీఆర్ చెప్పారు. మిగతా జిల్లాలలాగే హైదరాబాద్కు కూడా ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం నిర్మించుకుందామన్నారు. దసరా, దీపావళి పండగల తర్వాత నూతన కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షుల ఎంపికకు సంబంధించి పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు అధ్యక్షతన కమిటీ నిర్ణయం తీసుకొని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు.
20వ తేదీలోగా 4,800 కాలనీలు (వార్డులు), దాదాపు 1,486 నోటిఫైడ్ బస్తీలలో కమిటీలను ఎంపిక చేయనున్నారు. వార్డు స్థాయిలో ఏర్పడే కమిటీలో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు కార్యవర్గ సభ్యుల చొప్పున మొత్తం 11 మంది ఉంటారు. నెలాఖరులోగా 150 డివిజన్లకు కమిటీలు వేయనున్నారు. విద్యార్థి, కార్మిక, మహిళ, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సోషల్ మీడియా అనుబంధ కమిటీలు ఉంటాయి.. ప్రతి కమిటీకి తొమ్మిది మంది చొప్పున 90 మంది ఉంటారు.
ప్రతి కమిటీలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వర్గాలకు 51 శాతానికి మంచి భాగస్వామ్యం కల్పించాలని, అలా లేని కమిటీలు చెల్లుబాటు కావని ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో పార్టీ రాష్ట్ర బాధ్యులు నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ ఉంది. రెండుసార్లు పార్టీ మేయర్ పీఠాన్ని సొంతంగా దక్కించుకోవడం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమైంది. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా 60 లక్షలకు పైగా సభ్యత్వాలతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్ఎస్లో ఒక వ్యక్తి పార్టీ మెంబర్గా ఉండటమే అతి పెద్ద పదవి. సరైన సమయంలో అందరికీ అవకాశాలు వస్తాయి. పార్టీ కార్యకర్తకు ఏదైనా కష్టమొస్తే ఆ కష్టాన్ని తీర్చేందుకు పార్టీ పెద్దలు ముందున్నారు. పనిచేసే ప్రభుత్వంపై మాట్లాడే ముందు ప్రతిపక్షాలు బాధ్యతగా ఆలోచించాలి.
ఏది పడితే ఆది మాట్లాడితే ఇక సహించబోము. కొందరు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వమే గుడిని నిర్మించిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ప్రతిష్టాత్మ కమైన యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది. గతంలో ఏ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షలు ఇవ్వలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు పెడుతుంది. .మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇవ్వాల కొంతమంది ఎగిరెగిరి పడుతున్నరు. టీ..బీజేపీ, టీ..కాంగ్రెస్.. గుండెమీద చెయ్యేసుకొని చెప్పాలి.. ఇవ్వాళ ఈ పదవులు ఉన్నయంటే అవి కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అసలు కేసీఆరే లేకపోతే టీ కాంగ్రెస్..టీ బీజేపీ ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని దేకినోడు ఎవడు? మిమ్మల్ని అడిగినోడు ఎవడు? ఇవ్వాళ ఎగిరెగిరి పడుతున్న చిల్లర నాయకులను గంజిల ఈగల్లెక్క..తీసిపారేసేది. వాళ్లను ఆనాడు ఎవరైనా పట్టించుకున్నారా?
2014లో 63 సీట్లు ఇచ్చిండ్రు…12,769 గ్రామ పంచాయతీల్లో 10వేల గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. 32 జడ్పీలు ఉంటే..ఒక్కటికూడా పోకుండా..32 జడ్పీల్లో గులాబీ జెండా ఎగురవేసినం. 2018లో శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాల్లో 88 స్థానాల్లో బ్రహ్మాండంగా ప్రజలు ఆశీర్వదించి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనకు మళ్లీ మనకు అవకాశం కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలో 9 సీట్లు మనకే కట్టబెట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 142కి 132ని టీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. సింగిల్ విండోలు.. ఎంపీటీసీలు.. జడ్పీటీసీలు.. ఎన్నిక ఏదైనా…ఏడేండ్లలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇవ్వాళ ఎగిరెగిరిపడే నాయకుల జీవితాలు.. వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ ప్రజలకు తెలుసు. వాళ్లంతా కేవలం పత్రికల్లో హెడ్లైన్ల కోసం పైశాచిక ఆనందం కోసం మాట్లాడే నాయకులే. వారిని ప్రజలు సీరియస్గా తీసుకుంటలేరు. రాంగా పోంగా అక్కడక్కడ సర్కస్ లెక్క వాళ్లను చూసుకుంటూపోతరు. దాని కోసం కేవలం సైన్యముంటే సరిపోదు..ఎక్కడిక్కడ సైన్యాధిపతులుండాలె. ఎక్కడిక్కడ పటిష్టంగా ఉండాలె. జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ మూడు జిల్లాల్లోని నియోజకవర్గాల ముఖ్యనాయకులతోని సమావేశం పెట్టుకోవాలె. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు.. అందరూ సమావేశం పెట్టుకోవాలె.
సిటీబ్యూరో, సెప్టెంబరు 7(నమస్తే తెలంగాణ): జల విహార్లో మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థ ప్రత్యేకతను చాటుకున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, గడిచిన ఏడేళ్ల ప్రగతి పథంలో దూసుకువెళుతున్న రాష్ట్ర అభివృద్ధి పథకాలను డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శన శ్రేణులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థ లక్ష్మణ్ మురారి, రమేష్లను మంత్రి కేటీఆర్ అభినందించారు.
ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మన పార్టీ శ్రేణులవే. మనమే చెప్పాలి. తెలంగాణలో ఒక బిడ్డపుడితే కేసీఆర్ కిట్తో మగబిడ్డ పుడితే రూ. 12వేలు…ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు ఇస్తున్నాం. బిడ్డపుట్టి కొద్దిగా పెద్దగా కాగానే తల్లికి ఆరోగ్యలక్ష్మి, బిడ్డకు బాలామృతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. బిడ్డ బడికిపోతనంటే..ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం. హాస్టల్లో ఉండి చదువుకుంటా అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద విద్యార్థుల కోసం 950 గురుకుల పాఠశాలలు.
వీటిల్లో 4లక్షల 70వేల మందికి ఒక్కొక్కరికి రూ. 1లక్షా 20వేల చొప్పున ఖర్చుపెట్టి నాణ్యమైన ఇంగ్లీష్మీడియం విద్యను అందిస్తున్న ప్రభుత్వం. ఆ పిల్లలు పెద్దగై ఇంటర్మీడియెట్, డిగ్రీ చదివేవారికి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో రూ. 16-17వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. విదేశాలకు పోయి చదువుకునే వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పేరుమీద ఒక్కొక్క విద్యార్థికి భారతదేశంలో విదేశీ విద్య కోసం రూ. 20లక్షలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 225 బస్తీదవాఖానలు వచ్చినవి.
పేదవాడికి తను ఉన్నచోటే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. 75 ఏండ్లల్లో హైదరాబాద్లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఈ మూడు ఆస్పత్రులే ఉండేవి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తరవాత ఈ రోజు తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గచ్చిబౌలీలో, ఎల్బీనగర్లోని గడ్డిఅన్నారంలో, అల్వాల్, సనత్నగర్ ఈ నాలుగు ప్రాంతాల్లో 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పెట్టుకోబోతున్నాం. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, విప్ ఎంఎస్ ప్రభాకర్ తదితరులు ప్రసంగించగా..జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నాయకులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మహిళల ప్రాధాన్యత పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం చాలా సంతోషకరం. దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో పార్టీ జెండా కట్టే సాహసం చేయడం లేదు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తుండటం మామూలు విషయం కాదు. ఒక్కడితో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం, ఇప్పుడు 60 లక్షలకు చేరింది. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అవతరించింది. పని చేసే ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో న్యాయం జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. దేశానికి గాంధీ ఎలాగో, రాష్ర్టానికి సీఎం కేసీఆర్ అలాగే. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది. హోం మంత్రి మహమూద్ ఆలీ
2001 ఏప్రిల్ 27న పార్టీ పుట్టి రెండు దశాబ్దాలు నిండి ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్ గురించి మాట్లాడే ముందు చరిత్రను ఒక్కసారి స్మరించుకోకపోతే..చరిత్రలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోకపోతే… ఆనాడు ఒక్కసారి చరిత్రను చూసుకుంటే 2001 ఏప్రిల్ 27… కేసీఆర్ ‘నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరుతా’ అని నిర్ణయం తీసుకున్ననాడు ఆయన వయస్సు 47 సంవత్సరాలు. ఆనాడు ఆయన మంత్రిగా పనిచేసి ఉండొచ్చు…డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు. అప్పటికే ఎమ్మెల్యేగా నాలుగైదు సార్లు పనిచేసి ఉండొచ్చు..కానీ, రాష్ట్ర స్థాయిలో పాపులారిటీ ఉన్న నాయకుడు కాదు.
మనీపవర్, మజిల్ పవర్ లేదు. మీడియా పవర్ లేదు… ఏ పవర్ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు ఒకే ఒక్కడు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ పట్ల అపనమ్మకం..1969 ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడి 370 మంది విద్యార్థుల ఆత్మబలిదానాల తరువాత తెలంగాణ ప్రజాసమితి 11 సీట్లు గెలిస్తే కూడా తెలంగాణ ఇవ్వలె. చెన్నారెడ్డి, మల్లిఖార్జున్ నేతృత్వంలో వీరోచితంగా పోరాటం చేసినా ఆనాడు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్కషంగా..తెలంగాణ ప్రజల గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలని నినదించినా కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. ఆ తరువాత తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం..ఇగ రాదు తెలంగాణ. ఏం చేసినా వచ్చే పరిస్థితి లేదు.
మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి..ఇంద్రారెడ్డి సహా ఇంకొందరు పెద్దలు ప్రయత్నాలు చేసినా..తెలంగాణలో బుద్ధిజీవులు..ఆచార్య జయశంకర్ లాంటి పెద్దలు ఆ జ్వాలను ఎప్పటికప్పుడు ఆరిపోకుండా ప్రయత్నం చేసినా ఒక కొలిక్కిరాలే. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు..ఎన్నో అపనమ్మకాలు..రాజకీయ నాయకుడంటే పదవి కోసమే నాయకుడు. పదవి కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటరు అనే అపనమ్మకం ఉండేది.
కేసీఆర్ చిన్నప్పటి దోస్త్..సార్ దగ్గరికొచ్చి ‘అరే శేఖర్ ఎందుకీ బాధ..గీ వయస్సుల రాజకీయ నాయకుడికి టేక్ ఆఫ్ పాయింట్ ఇది. గట్టిగ మాట్లాడితే.. గట్టిగ కొట్లాడితే మంత్రి అయితవు.. నువ్వేది కావాలంటే అది చంద్రబాబు ఇస్తా అంటుండు.. ఏ మంత్రి పదవి కావాలంటే ఆ మంత్రి పదవి ఇస్తా అంటుండు…ఎందుకీ కొత్త వ్యవహారం’ అని అడ్వైజ్ ఇచ్చిండు…అప్పుడు మన నాయకుడు కేసీఆర్ ఒక్కటే మాట అడిగిండు…‘తెలంగాణ వస్తే మంచిదా…కాదా?’ అని ..‘వస్తే మంచిదే..కానీ, అప్పుడు కేసీఆర్ ఆడికే ఆగు ఇగ. వస్తదా..రాదా? వస్తే ఎట్లొస్తది..ఏం చేస్తే వస్తది.. తెలంగాణ కోసం లైఫ్ మిషన్ పెట్టుకున్న..దాని కోసం జీవితం అయిపోయేదాకా పనిచేస్త.. అని లక్ష్యం పెట్టుకొని 2001లో గులాబీ జెండాను ఎగురవేసి ఒకే ఒక్కడుగా..ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రారంభించిననాడు ఆయనకేం లేదు.. ఒక్కడుగా బయలుదేరి…ఈరోజు టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా భారతదేశంలో మొత్తం మనవైపు చూసే విధంగా..మన పార్టీని అజేయమైన శక్తిగా తయారుచేశారు.
ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు..నోటికి ఎంతొస్తే అంత..డైలాగులు చెప్పొచ్చు.. కానీ ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ బయలుదేరిననాడు…ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఛేదించటానికి..ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించటానికి తప్పకుండా తెలంగాణ వస్తది అనే విశ్వాసాన్ని కలిగించడానికి..తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ప్రజల్లో అపనమ్మకాన్ని పోగొట్టేందుకు…రాజకీయ నాయకులు పదవుల కోసమే జెండాలు ఎత్తుతరు..పదవుల కోసమే జై తెలంగాణ అంటరు అన్న అపనమ్మకాన్ని పోగొట్టేందుకు జలదృశ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి..టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి త్యాగాల పునాదులపై తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిద్దాం అని బయలుదేరారు. అది సరిపోదని తెలుసు..అందుకే ఆనాడు గొప్ప మాటన్నడు.. ‘నేను కనుక ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి..’ అని చెప్పిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.
ఆ మాట అనేందుకు ఎన్ని గుండెలుండాలె..ఎంత ధైర్యం కావాలె? ఎంత ఆత్మైస్థెర్యం కావాలె? తనమీద తనకున్న నమ్మకం..తన ప్రజల మీద తనకున్న అచంచెల విశ్వాసం.. ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇంతగొప్పగా తన ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పిన కేసీఆర్ వంటి మహానాయకుడు మరొకరు లేరు. కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థుల నుంచి మొదలుకొని తెలంగాణలోని సబ్బండ వర్గాలు..కులాలకు ..మతాలకు అతీతంగా ఉప్పెన సృష్టించారు. తెలంగాణ ఇక ఇవ్వక తప్పని పరిస్థితులను కేసీఆర్ సృష్టించి..కేంద్రం మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించారు.
రాష్ట్రంలో మరో 20 యేండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం. 60 లక్షలకు పైగా సభ్యత్వాలు కలిగిన పార్టీగా టీఆర్ఎస్ ఉండటం దేశంలోనే ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రంలో వానలు లేక అల్లాడిపోయారు. రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. ఇప్పడు వానలు చాలు అని దేవుడిని మొక్కుతున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ కనిపిస్తుంటే, హైదరాబాద్ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ కనిపిస్తున్నారు. తెలంగాణలో గులాబీ పండగ జరుగుతుంది. మంత్రి మల్లారెడ్డి
టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే టీఆర్ఎస్. పార్టీ బలం కార్యకర్తలే..! కార్యకర్తల వల్లే మేం ఉన్నత స్థానంలో ఉన్నాం. జనరల్ స్థానంలో బీసీకి మేయర్ పదవి ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎల్లప్పుడూ కార్యకర్తలకు సేవ చేసేందుకు నేను ముందుంటా. మేయర్ గద్వాల విజయలక్ష్మి