దుండిగల్,ఏప్రిల్ 15 : డా.బీఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా హైదరాబాద్ మహానగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రగతినగర్లోని శ్రీకృష్ణాగార్డెన్లో శనివారం ప్రగతినగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ మహానగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలోనే తాగునీటి ఇబ్బందులు అధిగమించి ఇంటింటికీ తాగునీటిని అంధించిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. కానీ ఇటీవల నగరానికి వచ్చిన ప్రధాని మోదీ మాత్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నగర అభివృద్ధి అంతా తామే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
మెట్రోరైలు, ఓఆర్ఆర్,ై ఫ్లెవర్ల నిర్మాణంలో కేంద్రం నిధులు ఏమీ లేవని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రామంతాపూర్ నుంచి ఉప్పల్ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ ఆరేండ్లుగా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రూ.470కోట్లతో రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా సహాయనిరాకరణ చేస్తుందని ఆరోపించారు. దేశసంపదను అదానీకి దోచిపెడుతున్న కేంద్రం తీరును ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బయపెట్టాలని చూస్తుందన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించుకున్న సీఎం కేసీఆర్ ఇలాంటి బెదిరింపులకు ఆదరడు..బెదరడన్నారు. ఎన్నికల వేళ తోడేళ్ల గుంపుల్లా ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తాయని, వాటిని సమర్థవంతగా బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా సోషల్ మీడియాలో చేసే విమర్శలకు కార్యకర్తలు తగురీతిలో సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యమకారులను కాపాడుకుంటామన్న ఆయన వారికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అన్నారు. అంతకు ముందు ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులచే మాట్లాడించిన ఎమ్మెల్యే వారి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన తన హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమాను వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజుయాదవ్, ఫ్లోర్లీడర్ ఆగంపాండు ముదిరాజు, నిజాంపేట్ నగర పాలక సంస్థ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాకలపూడి రంగరాయప్రసాద్, కార్పొరేటర్లు, బాలాజీనాయక్, ఆగం రాజు, శ్రీనివాస్యాదవ్, ఇంద్రజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్రెడ్డి, ఆవుల ప్రసన్న, ప్రణయ, బొర్ర దేవి, సుజాత, కో-అప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొలన్గోపాల్రెడ్డి, చల్లా సుధీర్రెడ్డి, కొలన్ శ్రీనివాస్రెడ్డి(కేఎస్ఆర్), కొండారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, మంగీలాల్ నాయక్, రాములు నాయక్, మహిళా నేతలు సబితారెడ్డి, అర్పిత పాల్గొన్నారు.
మన కుత్బుల్లాపూర్-మన ప్రగతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ..
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గడిచిన తొమ్మిదేండ్లుగా ఎమ్మెల్యే వివేకానంద్ రూ.6 వేలకోట్ల పై చిలుకు నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ‘మన కుత్బుల్లాపూర్-మన ప్రగతి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రత్యేక సంచిక రూపకల్పన చేసిన నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని అభినందించారు.