తెలంగాణ భవన్లో ఆదివారం టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను ఎప్పుటికప్పుడు ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి తదితరులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు
బంజారాహిల్స్,నవంబర్ 27: నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లతో జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, ఎంఎస్.ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, రావుల చంద్రశేఖర్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రావణ్కుమార్ తదితరులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
మోదీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్కే ఉంది: ఎమ్మెల్యే మాగంటి
దేశంలో రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అని, దేశంలో మోదీని ఎదుర్కొనే శక్తి సీఎం కేసీఆర్కే ఉన్నదని ప్రజలు నమ్ముతున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. ఎనిమిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే బీజేపీ మాత్రం అబద్ధాల పునాదులపై జనాన్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ పాత్ర లేదని బుకాయించిన బీజేపీ అధ్యక్షుడు హడావిడిగా వెళ్లి యాదాద్రిలో ప్రమాణం చేశారని, చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ జిల్లాలో డివిజన్ స్థాయిలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తామని, ఆయా డివిజన్లలో బూత్ స్థాయి కార్యకర్తల కష్టనష్టాల గురించి తెలుసుకోవడంతో పాటు రానున్న ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తామన్నారు. ప్రత్యేక ఓటరు నమోదుపై కార్యకర్తలు దృష్టి పెట్టాలని, పోలింగ్ బూత్లు దూరంగా ఉంటే వాటిని సమీపంలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
స్వరాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి
– ఎమ్మెల్యే కాలేరు
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని, కానీ బీజేపీ నాయకులు అభివృద్ధి పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వారు చెబుతున్న అబద్ధాలను టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం అందరిలో నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
బీజేపీలో భయాందోళన
– కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయాందోళన మొదలైందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. ఎన్నికల సమయంలో కాషాయ పార్టీ కుయుక్తులు పన్నేందుకు సిద్ధంగా ఉన్నదని, దానిని ఎదుర్కొని పార్టీని మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 100 మంది కార్యకర్తలకు ఓ నాయకుడిని ఇన్చార్జిగా నియమించుకోవాలని, ఆ వంద మంది ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరుతెన్నులను వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినవారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి గడుపకు తీసుకెళ్తామన్నారు.
ఉద్యమకారులను కలుపుకొని పోవాలి
– డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ రాష్ర్టాన్ని సాధించుకునే దాకా విశ్రమించని ఉద్యమకారులను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలుపుకొని పోవాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి కోరారు. ఒక ఉద్యమకారుడి కుటుంబం నుంచి వచ్చిన తనకు తగిన గుర్తింపు వచ్చిందని, అదే రీతిలో గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది ఉద్యమకారులను కలుపుకొని పోయి వారికి భరోసా కల్పించాలని కోరారు.
మాటలు ఎక్కువ..పనులు తక్కువ
– ఎమ్మెల్సీ వాణీదేవి
రాష్ట్రంలో ఏమీ చేయకుండానే మాటలు చెబుతున్న బీజేపీ తీరును ఎండగట్టాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పిలుపునిచ్చారు. మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అన్న చందంగా బీజేపీ తీరు ఉన్నదని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీ చేతల పార్టీ అని తెలిపారు. చేసిన మంచి పనులు చెప్పుకోకపోతే వేరే పార్టీలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నదన్నారు.
బూత్ స్థాయి నుంచే తిప్పికొట్టాలి
– ఎమ్మెల్యే దానం
రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ సూచించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తాను ఎన్నడూ చూడని అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూశానన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, వారికి సరైన అవకాశాలు వస్తాయన్నారు. పదవుల్లో ఉన్నవారి వెనక కార్యకర్తల కష్టం ఉన్నదని, వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉన్నదన్నారు.
అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత ఆదరణ చూరగొనాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మునుగోడులో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రచారం చేయాలని సూచించారు. గల్లీ గల్లీలో చేపడుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు, మార్పును ప్రజలు ముందుంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.