జూబ్లీహిల్స్/ ఎర్రగడ్డ, నవంబర్ 29: కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసుఫ్గూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి 13 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం దీక్షా దివాస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బండారి రాజ్కుమార్ పటేల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు కబడ్డీ, ఖోఖో, క్యారమ్ బోర్డ్, చెస్, షెటిల్ తదితర పోటీలు నిర్వహించారు. పోటీలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించి కార్యకర్తలతో కలిసి చదరంగంతో పాటు వివిధ ఆటల్లో సరదాగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోశ్ ముదిరాజ్, నర్సింగ్దాస్, తదితరులు పాల్గొన్నారు.