సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : అనాదిగా వస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక వైభవాలు విశేషంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో గిరిజన జాతులు, తెగలకు సంబంధించిన సంస్కృతి, జీవన విధానాన్ని నేటి తరం.. భవిష్యత్ తరాలకు చాటి చెప్పేందుకు మాసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ ట్రైబల్ మ్యూజియం వేదికగా నిలుస్తున్నది. గిరిజన సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా కొత్త హంగులతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన తెగలకు సంబంధించిన ప్రదర్శనలు మాత్రమే ఉండటం విశేషం.
రాష్ట్రంలోని గొండి, కోయ, ఎరుకల, లంబాడా, ఆంద్, కోలం, చెంచులు, కొండారెడ్లు, ఇతర తెగలకు సంబంధించిన జీవితాలను పరిశీలించి.. వారి సంస్కృతి, ఆహారం, జీవనశైలి, వారి నమ్మకాలను సూచించే విధంగా బొమ్మల రూపంలో ప్రదర్శనలున్నాయి. గుడిసెలు, హస్తకళలు, కళాఖండాలు, త్రీడి శిల్పాలతో పాటు, మ్యూజియంలో మట్టి, వెదురు, గడ్డితో తయారు చేసిన పలు గ్యాలరీలు ఉన్నాయి. వివిధ గిరిజన తెగలు ఉపయోగించే వ్యవసాయ ఉపకరణాలు, మట్టి పాత్రలు వంటి ముఖ్యమైన వస్తువులను కూడా ఉంచారు. గోడలు కుఢ్య చిత్రాలతో అలంకరించబడి గిరిజన వాతావరణాన్ని పోలి ఉంటాయి. 80 సీట్ల యాంపీ థియేటర్ మ్యూజియం సందర్శనకు వచ్చే వారికి గిరిజనులపై లఘు చిత్రాల వీడియోలను ప్రదర్శిస్తున్నారు.
గిరిజన కళలు, సంస్కృతిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రైబల్ మ్యూజియాన్ని తీర్చిదిద్దింది. మ్యూజియంలోకి అడుగు పెట్టాక అడవిలోని గిరిజన వాడలో తిరుగుతున్న భావన కలుగుతుంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక తెగల జానపద, జీవన శైలి, సామాజిక ఆచారాలు ఒకే చోట ప్రదర్శనగా ఏర్పాటు చేశాం. గిరిజన గ్యాలరీ, కోయ గ్యాలరీ, కోయవాళ్లు నిర్వహించే మేడారం జాతర గ్యాలరీ.. మేడారం సారలమ్మ దేవతలను, అక్కడి పరిసరాలను ఈ మ్యూజియంలో స్పష్టంగా చూడవచ్చు. మూడు అంతస్తుల్లో ఈ మ్యూజియం ఉన్నది. మొదటిలో ఆదిమ వాసుల సంస్కృతి, కుటుంబ విధానం, ఆవాస విధానం ప్రదర్శిస్తున్నాం. రెండులో ఇతర గిరిజన తెగల సంస్కృతిపై , మూడో అంతస్తులో గిరిజన తెగలు వినియోగించిన వస్తు సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలున్నాయి. – ద్యావనపల్లి సత్యనారాయణ, మ్యూజియం క్యురేటర్