కొండాపూర్ : గిరిజన, ఆదివాసీయుల అభ్యున్నతికి ప్రభుత్వాలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ఆద్య కళా ప్రదర్శనను ఆదివారం ఆమె సందర్శించారు. ప్రదర్శనలో ఉంచిన గిరిజన, ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే కళారూపాలు, వాయిద్య సాధనాలు, చిత్ర లేఖనాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 9న ఆదివాసి దినోత్సవం కావడంతో ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రదర్శనలోని ఆదివాసీయులు వినియోగించిన పలు పరికరాలు, వాయిద్య సాధనాలు, చిత్రాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటుకై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసులకు మెరుగైన వైద్యం, విద్యను అందించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్ తదితర జిల్లాలలోని ట్రైబల్ ఏరియాల్లో రాజ్భవన్ ఉద్యోగులు, ఈఎస్ఐ వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొవిడ్ మహమ్మారీ సమయంలోను వారిలో వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించినట్లు, రెండో డోసు వ్యాక్సిన్ సైతం వారి మధ్యలోనే తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు, గిరిజనులను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర మోహన్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, ప్రొఫెసర్ గూడురు మనోజ, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.