సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ): నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విదేశీయులకు పాస్పోర్టులు, వీసాలు ఇప్పిస్తూ దేశం దాటిస్తున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్లోనూ సంచలనంగా మారింది. ట్రై పోలీసు కమిషనరేట్ పోలీసులు ఇలాంటి ముఠాలను అప్పుడప్పుడు అరెస్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా.. సీఐడీ అరెస్టు చేసిన ముఠాలకు.. హైదరాబాద్లో గతంలో అరెస్టయిన ముఠాల్లోని ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఎస్బీ అధికారులను సైతం సీఐడీ అరెస్టు చేసింది. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ అంశంలో ఎస్బీదే కీలక పాత్ర. పాస్పోర్టు దరఖాస్తుదారుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి, అవి నిజమని ధ్రువీకరించిన తర్వాతే ఎస్బీ రిపోర్టు చేస్తుంది. పదేండ్ల కిందట ఎస్బీలో ఇష్టానుసారంగా కొనసాగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్బీని పూర్తిగా ప్రక్షాళన చేసి, పాస్పోర్టు వెరిఫికేషన్లో పారదర్శకతను తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. పాస్పోర్టు వెరిఫికేషన్లో ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో ఈజీ కాదని, నకిలీ ముఠాలు జిల్లాలకు విస్తరించాయి. అయితే, విదేశీయులకు పాస్పోర్టులు, వీసాలే కాదు, ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు కూడా చాలా మందికి చేరాయి.
మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి మన దేశంలోకి వస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా.. మయన్మార్ సైన్యం కూడా అడ్డదారిలో మన దేశంలోకి చొరబడింది. నిరాశ్రయులుగా కొందరు, అడ్డదారిలో మరికొందరు దేశంలోకి చొరబడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చొరబాట్లను అడ్డుకోలేక పోతోంది. దేశంలోకి చొరబడిన విదేశీయులు వివిధ మార్గాల్లో వచ్చి.. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఇలాంటి వారిని ఏజెంట్లు కలిసి.. ఇక్కడే పుట్టినట్లు జనన ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడే చదివినట్లు నకిలీ విద్యా సర్టిఫికెట్లు సృష్టించి, ఆ నకిలీ సర్టిఫికెట్తో ఆధార్ కార్డును పొందుతున్నారు. ఆధార్, ఓటర్ కార్డు పొందిన తర్వాత ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో నకిలీ సర్టిఫికెట్లతో విదేశీయులకు పెండ్లీలు చేయడం, విదేశీయులకు నకిలీ పాస్పోర్టులు తయారు చేసి ఇవ్వడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు విదేశీయుల కోసం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి.. వాటి ఆధారంగా పాస్పోర్టు, వీసాలను ఇప్పిస్తున్న ముఠాలపై నిఘా పెంచారు.