హిమాయత్ నగర్, మే 13: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025 గ్రేడింగ్ విధానమే అమలు చేయాలని తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వారు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులతో బడ్జెట్ స్కూల్ ఉపాధ్యాయులకు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సర్వీస్ రూల్స్ ప్రకారం సన్మానించి అవార్డులు ఇవ్వాలన్నారు.
అదే విధంగా కార్పొరేట్ స్కూల్లను నియంత్రించాలన్నారు. బడ్జెట్ పాఠశాలలో 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు. అనంతరం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగిత రాణా, శ్రీ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిను కలిసిన ట్రస్మా సభ్యులు వారికి వినతిపత్రాలు అందజేశారు.