కుండపోత వాన.. గుండెకోతను మిగిల్చింది. నాలాలో కొట్టుకుపోయి.. ఓ చిన్నారి మృతి చెందడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది. శనివారం ఉదయం నగరాన్ని వాన ముంచెత్తింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసమని తన సోదరుడితో కలిసి బయటకు వెళ్లిన మౌనిక(11) నీటితో నిండి ఉన్న గుంతలో పడి.. నాలాలో కొట్టుకుపోయింది. అప్పటివరకు ఆడుతూ..పాడుతూ కనిపించిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బాధిత కుటుంబాన్ని పరామర్శించి..పరిహారం ప్రకటించారు. అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. కాగా, పాప మృతి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను బల్దియా కమిషనర్ సస్పెండ్ చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్ : సికింద్రాబాద్ బేగంపేట్ సర్కిల్ పరిధిలోని కళాసిగూడలో విషాదం నెలకొన్నది. శనివారం ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి పదకొండేండ్ల బాలిక మౌనిక మృతి చెందింది. కిందపడ్డ సోదరుడు వరదలో కొట్టుకుపోకుండా రక్షించబోయే క్రమంలో మౌనిక నీటి గుంతలో పడిపోయింది. అర కిలోమీటర్ దూరం నాలాలో కొట్టుకుపోయి మ్యాన్హోల్ వద్ద శవమై కనిపించింది. అప్పటి వరకు తమ ఎదుట ఆడుతూ పాడుతూ కనిపించిన కూతురు విగతజీవిగా మారడంతో మౌనిక తల్లిదండ్రులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన ఇద్దరు అధికారులను బల్దియా కమిషనర్ సస్పెండ్ చేశారు. ఘటనా స్థలికి వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
కళాసిగూడలోని ధన్బజార్కు చెందిన శ్రీనివాస్, రేణుక దంపతులకు కార్తిక్(15), మౌనిక(11) సంతానం. శ్రీనివాస్ స్థానికంగా బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు. భార్య రేణుక ఇంటి వద్దే చిన్నపాటి దుకాణాన్ని నడుపుకుంటున్నది. కార్తిక్ మానసిక వికలాంగుడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. మౌనిక గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది. పాల ప్యాకెట్ కోసం శనివారం ఉదయం 6.30 గంటలకు మౌనిక తన సోదరుడు కార్తిక్తో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటికే భారీగా వర్షం కురవడంతో కళాసిగూడలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రాంతం జలమయమైంది. స్కూల్ ముందు సీసీ రోడ్డును తవ్వి వదిలేయడంతో అదే దారిన నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో కార్తిక్ కిందపడ్డాడు. మౌనిక వెంటనే సోదరుడిని పైకి లేపింది. ఇదే క్రమంలో మౌనిక పక్కనే నీటితో నిండి ఉన్న గుంతలో పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు మౌనిక కోసం వెతకగా.. అప్పటికే నీటి ఉధృతికి మౌనిక నాలా వరదలో దూరంగా కొట్టుకుపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, మహంకాళి పోలీసులు, డీఆర్ఎఫ్, ఫైర్ అధికారులు నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్న పార్కులేన్ వద్ద నాలా మ్యాన్హోల్కు తట్టుకుని మౌనిక కనిపించగా, బయటకు తీశారు. అప్పటికే బాలిక మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో మౌనిక మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కూతురు మృతితో మౌనిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
కళాసిగూడలో బాలిక మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఘటనా స్థలంలో సరైన భద్రత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన బేగంపేట అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేస్తూ బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఈఈ ఇందిరా బాయిని నియమించారు. పదిరోజుల్లో సమగ్ర నివేదికను అందజేయాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాలిక మృతి చెందినట్లు తెలిసిన వెంటనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. బాధిత కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. అక్కడికక్కడే రూ.2లక్షల ఎక్స్గ్రేషియాను మేయర్ ప్రకటించారు. బాధ్యులైన ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, గుంతలను పూడ్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఎంతో భవిష్యత్ ఉన్న బాలిక చనిపోవడం కలచివేసిందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి తలసాని భరోసా ఇచ్చారు. రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. నాలాలపై చేపట్టిన నిర్మాణాల వల్లే భారీ వర్షాలు పడిన సందర్భంలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. నాలాల మరమ్మతులకు రూ.590 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రూ.10 కోట్లతో కళాసిగూడ నాలాకు సైతం మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో నగరంలో వరదలు వచ్చినప్పుడు రూ.10వేల చొప్పున రూ.650 కోట్లను పరిహారంగా అందజేసినట్లు మంత్రి గుర్తు చేశారు. బాధితులకు సానుభూతి తెలుపడంతోపాటు సాయం చేయాల్సిందిపోయి కొందరు బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వెంట గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, రాంగోపాల్పేట్ కార్పొరేటర్ అరుణ గౌడ్, సికింద్రాబాద్ బల్దియా జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డి, ఆర్డీవో ఉన్నారు.