Hyderabad Metro | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మొదలు పెట్టారు. రెండు కన్సల్టెన్సీ సంస్థలతో వేర్వేరుగా ప్రతిపాదిత మార్గాల్లో ట్రాఫిక్ సర్వేతో పాటు భూ పరీక్షలు, స్టేషన్ల నిర్మాణం, మెట్రో రైళ్లు నిలిపేందుకు అవసరమైన డిపోల స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రెండోదశ మెట్రో కీలకమైన మెట్రో కారిడార్లో నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు లోపలి వరకు మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉంది.
దీంతో ఈ మార్గంలోనే ఒక మెట్రో డిపోను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దానికి అనుగుణంగా స్థల లభ్యతపై మెట్రో అధికారులు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులతో సంప్రదింపులు చేయగా, అవసరమైన స్థలాన్ని మెట్రో డిపో కోసం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో రైళ్లను నడపాలంటే కనీసం రెండు మెట్రో డిపోల అవసరం ఉంటుందని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. మెట్రో డిపోను ఏర్పాటు చేయాలంటే కనీసం 40-50 ఎకరాల స్థలం అవసరమని, ఆ స్థాయిలో భూముల లభ్యతను ఇతర కారిడార్లలో అన్వేషిస్తున్నామని తెలిపారు. రెండో దశ మెట్రో డీపీఆర్ను మరో నెల వ్యవధిలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందని తెలిపారు.