కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 4 : విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సీఐ వాహనదారుడిపై చేయిచేసుకొని.. దుర్భాషలాడిన సంఘటన సోషల్ మీడియాలో రోజంతా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట నుంచి కేపీహెచ్బీ కాలనీ వెళ్లే రోడ్డులో కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఉదయం 11గంటలకు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ 09 బీవై 3849 నంబర్ గల పల్సర్ బైక్పై వెళ్తున్న ఓంప్రకాశ్ రెడ్డిని ఆపి వాహనం ధ్రువపత్రాలు చూపాలని పోలీసులు అడిగారు.
18 పెండింగ్ చలాన్లు..!
2012 నుంచి ఇప్పటి వరకు ఆ వాహనంపై 18 పెండింగ్ చలాన్లు ఉండగా సుమారు రూ.7వేలు చెల్లించాల్సి ఉంది. బైక్ కూడా ఓం ప్రకాశ్రెడ్డి పేరున కాకుండా సనత్నగర్కు చెందిన గంగుల సంజయ్ పేరుమీద ఉందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వాహనం ధ్రువీకరణ పత్రాలు చూపించాలని, పెండింగ్ చలాన్లు చెల్లించి వాహనం తీసుకువెళ్లాలని పోలీసులు సదరు వ్యక్తికి సూచించారు. తన వద్ద ధ్రువీకరణ పత్రాలు లేవని, పెండింగ్ చలాన్లు తర్వాత చెల్లిస్తానని, వాహనాన్ని ఇవ్వాలని ఆ వ్యక్తి గంటకు పైగా ప్రాదేయపడినా పోలీసులు కనికరించలేదు. మిగిలిన వాహనాలను తనిఖీ చేస్తుండగా వాహనదారుడు పదేపదే విసిగించగా ఆవేశం పెంచుకున్న ట్రాఫిక్ సీఐ బోసుకిరణ్ వాహనదారుడు ఓంప్రకాశ్రెడ్డిపై చేయిచేసుకున్నాడు. దుర్భషలాడుతూ అతడిని అక్కడినుంచి వెళ్లిపోవాలని కేకలు వేశాడు. ఈ సంఘటన అంతా సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టగా ట్రాఫిక్ సీఐ వాహనదారుడిని చేయితో కొట్టిన విషయం హల్చల్గా మారింది.
చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాం
వాహనాల తనిఖీలో భాగంగా ఓంప్రకాశ్రెడ్డి వాహనాన్ని ఆపడం జరిగింది. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు లేవు. పదేండ్లుగా ట్రాఫిక్ చలాన్లు (రూ.7వేలు)పెండింగ్లో ఉన్నాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాం. ఆ వ్యక్తి ధ్రువపత్రాలు చూపించకుండా… చలాన్లు చెల్లించకుండా పోలీసులతో వాదనకు దిగుతూ ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించాడు. వాహనంపై కేసు నమోదు చేసి బండిని సీజ్ చేశాం. ఇక్కడినుంచి వెళ్లాలని కోరాం. కానీ.. ఆ వ్యక్తి పకడ్బందీ వ్యూహంతో పోలీసులను పదేపదే విసిగించి ఆగ్రహించేలా చేసి సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాలకు అందించాడు. ఈ విషయంలో చట్ట ప్రకారమే విధులు నిర్వర్తించాం.
– బోస్ కిరణ్, ట్రాఫిక్ సీఐ, కూకట్పల్లి