బన్సీలాల్పేట, నవంబర్ 8: ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదేహాన్ని త్వరగా నగరానికి తీసుకువచ్చేందుకు తగిన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యాలయ అధికారులు, ఇటలీలోని భారత రాయభార కార్యాలయ అధికారులతో ఆయన మాట్లాడారు. పద్మారావునగర్లోని బంజారా అపార్టుమెంట్లో నివసించే రైల్వే ఉద్యోగి పత్తిపాటి రామచంద్రుడు, రాజేశ్వరీ దంపతులు. వీరి కుమారుడు పి. వెంకటసాయిఉదయ్ కుమార్ 2018లో ఇటలీ దేశానికి వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు.
2020లో నగరానికి తిరిగి వచ్చాడు. కరోనా విపత్కర పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి 2021లో ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాడు. ఈ నెల నాలుగవ తేదీ మధ్యాహ్నం ఉదయ్కుమార్ మరణించాడన్న సమాచారం కుటుంబ సభ్యులకు ఈ మెయిల్ ద్వారా వచ్చింది. దాంతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు అతడి రూమ్మెట్లను సంప్రదించారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో పద్మారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి బాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్కుమార్ గౌడ్, బి.శ్రీకాంత్రెడ్డి సహకారంతో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పరిస్థితి వివరించారు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత విద్య కోసం వెళ్లి.. ఇటలీలో అనుమానాస్పద స్థితిలో మరణించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలగూడ పోలీసు స్టేషన్లో కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.